ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం బ్రాండ్లన్నింటికీ చంద్రబాబే అనుమతి ఇచ్చారని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఏపీలో చీప్ లిక్కర్ లేనే లేదన్నారు.  చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 


‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌ భూంభూం బీర్‌, పవర్‌ స్టార్‌ 999, 999 లెజెండ్‌.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లేనన్నారు. ప్రెసిడెంట్ మెడల్‌ బ్రాండ్‌. గవర్నర్‌ ఛాయిస్‌ 2018, నవంబర్‌ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబేనన్నారు. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్‌ బ్రాండ్‌లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. పీఎంకే డిస్టిలరీస్‌ టీడీపీ నేత యనమల వియ్యంకుడిదని..  శ్రీకృష్ణ డిస్టిలరీస్‌ ఆదికేశవులనాయుడిదన్నారు. అలాగే  విశాల డిస్టిలరీస్‌ అయ్యన పాత్రుడిదని జగన్ తెలిపారు.  


ఏపీలో అమ్ముతున్న మద్యం  బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్‌ స్టేటస్‌, త్రీ క్యాపిటల్‌ అనే బ్రాండ్లు లేవన్నారు.  2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. తాము అమ్ముతున్న  బ్రాండ్‌లన్నీ లైసెన్స్ పొందిన డిస్టిలరీస్‌ నుంచి వచ్చినవేనన్నారు. ఏపీలో చీప్ లిక్కర్ లేనే లేదన్నారు. 
విపక్ష పార్టీలు ఏపీలో అమ్ముతున్న లిక్కర్ ప్రమాదకమైనదని రిపోర్టులు చూపించడంపై జగన్ మండిపడ్డారు  . ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్‌ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్‌ కూడా చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. 


వారు ఇచ్చిన లైసెన్స్‌డ్‌ డిస్టిలరీస్‌ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుందని ఆయన  ప్రశ్నించారు సీఎం జగన్‌. మా ప్రభుత్వం 16 మెడికల్‌ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్‌  విమర్శించారు. జంగారెడ్డి గూడెంలో చనిపోయిన వారి కుటుంబసభ్యుల వీడియోలను సభలో ప్రదర్శించారు.