CM Jagan Review : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం చెప్పారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని అధికారులను జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని ఆయన వెల్లడించారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం లబ్దిదారుల  జీవనోపాధికి ఉపయోగపడేలా బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి  చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. లబ్ధిదారులు పథకాన్ని అందుకునే మొదటి ఏడాది నుంచే వారిని స్వయం ఉపాధి మార్గాల వైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీని వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు.


మహిళలకు అవగాహనా కార్యక్రమాలు 


అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్థ ఉండాలని అవసరం అయితే ఇందు కోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం అమలు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారని  అన్నారు. హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్‌ జీ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఆయా సంస్థల డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తులను అందించాలని చెప్పారు. దీని వలన చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్, లేస్‌ పార్కు, ఇ– కామర్స్, ఇ–మిర్చి, బ్యాక్‌ యార్డు పౌల్ట్రీ, ఆనియన్‌ సోలార్‌ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని జగన్ సూచించారు.


గ్రామాల్లో మార్కెటింగ్ సదుపాయం  


గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో  స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని జగన్ అన్నారు. జిల్లాకు కనీసం రెండు సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్బంగా అధికారులు జగన్ కు తెలిపారు. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేయటంతో పాటుగా, ఒక్కో సూపర్‌ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్‌ లక్ష్యంగా ఏర్పాటు చేయాలన్నారు.