CM Jagan Review :  వేసవిలో ఏపీ ప్రజలకు విద్యుత్ కొరత ఉండకూడదని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని  సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతుల మోటార్లకు మీటర్లు , నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి వాతావరణం మారిపోవడంతో  విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో  250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని.. కోతలు లేకుండా చూడటానికి ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని సీఎంకు తెలిపారు.                         


విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు.  థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.                    


మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తామని.. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని  అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నాయని.. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామని తెలిపారు.  అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని .. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు  కనెక్షన్లు ఇచ్చామని  అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు.                                            


గత ఏడాది ఏపీలో కరెంట్ కోతలను విస్తృతంగా అమలు చేశారు. పవర్ హాలీడే కూడా ప్రకటించాల్సి వచ్చింది. అప్పట్లో విద్యుత్ ఎక్సేంజీల్లో  కొనడానికి కూడా సమస్యలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఇంకా డిమాండ్ పెరనుంది. దీంతో ముందు  జాగ్రత్తల కోసం సీఎం జగన్ అధికారుల్ని అప్రమత్తం  చేశారు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో ఏపీ ప్రజలకు కోతలు లేకుండా ఉంటాయి. లేకుంటే ఈ సారి కూడా కరెంట్ కష్టాల్లో ఉండాల్సిందే.