CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కాలేజీలను కట్టే కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. అందులో 5 మెడికల్‌ కాలేజీల్లో పిల్లలు అడ్మిషన్లు తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఈ మెడికల్‌ కాలేజీల నుంచి నాణ్యమైన విద్య పొంది.. రాబోయే రోజుల్లో గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు 5 మెడికల్‌ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించామని చెప్పుకొచ్చారు. 5 చోట్ల ఫస్టియర్‌ అడ్మిషన్లకు కూడా ఈరోజు పిల్లలను తీసుకొనే పరిస్థితిలోకి అడుగులు వేగంగా ముందుకు వేయగలుగుతున్నామన్నారు. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను మళ్లీ అడ్మిషన్‌ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. దాని తర్వాత మళ్లీ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అడ్మిషన్‌ స్థాయిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 


ఈ సంవత్సరం 5, వచ్చే ఏడాది 5, ఆ తర్వాత సంవత్సరం 7 మొత్తంగా 17 మెడికల్‌ కాలేజీలను తీసుకుని రాగలుగుతున్నాం అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు స్థాయిలో ఒక మెడికల్‌ కాలేజీ పెట్టే కార్యక్రమం ఇనీషియేట్‌ చేస్తున్నామన్నారు. ఎప్పుడైతే మెడికల్‌ కాలేజీ అవైలబుల్‌గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్‌ కాలేజీతో పాటు ప్రొఫెసర్లుగానీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్లుగానీ వీళ్లందరూ అవైలబుల్‌గా ఉండటం కూడా ఒక గొప్ప మార్పు టెరిషరీ కేర్‌లో జరుగుతుందన్నారు. టెరిషరీ కేర్‌ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే వేలాది మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్‌స్టిట్యూషన్స్‌ను కూడా రాష్ట్రంలో క్రియేట్‌ చేయగలగడం నిజంగా అద్భుతమన్నారు.


స్వా తంత్య్రం వచ్చిన తర్వాత నుంచి మన రాష్ట్రంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయని.. కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా అధికారం డీసెంట్రలైజ్‌ చేయగలిగామన్నారు. అవే కాకుండా మరో 17 మెడికల్‌ కాలేజీలను యాడ్‌ చేసి 28 మెడికల్‌ కాలేజీల దిశగా అడుగులు వేగంగా వేస్తున్నామన్నారు. 17 మెడికల్‌ కాలేజీలను కట్టడానికి దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. 










ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి అదనంగా రాబోతున్నాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లు 2,185 అని చెప్పారు. ఈ 17 మెడికల్‌ కాలేజీలు రావడంతో ఈ ఎంబీబీఎస్‌ సీట్లు ఏకంగా 4,735కు పెరుగుతాయన్నారు. ఇవే కాకుండా ఎగ్జిస్టింగ్‌ మెడికల్‌ కాలేజీలన్నింటిలోనూ సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్‌ చేయగలిగామన్నారు. ఆల్‌ ది పెండింగ్‌ వేకెన్సీస్, విత్‌ ఎ జీరో వ్యాకెన్సీ పాలసీ తీసుకుని రావడం వల్ల దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి రాగలిగాయన్నారు. భవిష్యత్‌లో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవన్నీ ఇంతగా చెప్పడానికి కారణం.. విద్యార్థులు మంచి డాక్టర్లు అయి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమేనన్నారు. ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్‌ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారన్నారు. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, ఇలాంటి బ్యాక్‌వర్డ్‌ ఏరియాల్లో కూడా మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయన్నారు. 2024–25లో మరో 750 మెడికల్‌ కాలేజీలు వస్తాయని చెప్పుకొచ్చారు. 


ఆ తర్వాత 2025–26లో గిరిజన ప్రాంతాలు, డిస్టెంట్‌గా ఉన్న ఏరియాల్లో టెరిషరీ కేర్‌ దొరకడం కష్టం అన్న ప్రాంతాల్లో పార్వతీపురం, నర్సీపట్నం లాంటి చోట్ల కూడా 2025–26లో మెడికల్‌ కాలేజీలు రాబోతున్నాయన్నారు. 1050 సీట్లు అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలను డెవలప్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1090 నర్సింగ్‌ సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకొస్తున్నామన్నారు. వీటి ద్వారా మరో 1200 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా 2019 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఒక పక్క క్యూరేటివ్‌ క్యూర్‌ ఎంత అవసరమో, ప్రివెంటివ్‌ కేర్‌ కూడా అంతే అవసరం అన్నారు. దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగిందన్నారు. ప్రివెంటివ్‌ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులు పడ్డాయని సీఎం జగన్ వివరించారు. 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు అయ్యాయన్నారు. ఆ విలేజ్‌ క్లినిక్స్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లు ఉంటారని పేర్కొన్నారు.


గ్రామ స్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నారు. 14 రకాల డయోగ్నస్టిక్‌ టెస్టులు చేస్తారని వివరించారు. దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్‌ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చామని పేర్కొన్నారు. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదని చాలా మంది అనుకుంటారని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. ఈరోజు అన్ని గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామ మాత్రంగా ఉండేవని.. 1050 ప్రొసీజర్లు ఉంటే, ఈరోజు 30255 ప్రసీజర్లకు విస్తరించాయన్నారు. క్యాన్సర్‌ దగ్గర నుంచి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ దాకా కవర్‌ అవుతున్నాయన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలని తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌ 900 హాస్పిటల్స్‌ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయన్నారు. 


ఇప్పటి వరకు బటన్‌ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగామన్నారు. ఇంటి తలుపు తట్టి మరీ పెన్షన్‌ను అందిస్తున్నామన్నారు. ఇంటి తలుపు తట్టి రేషన్‌ కార్డు, రేషన్‌ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగామని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా అని వెతికి, అప్లికేషన్‌ పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగామని పేర్కొన్నారు.  22 లక్షల ఇళ్లు వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరికి ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అవసరాలు తీరుస్తున్నామని వివరించారు. జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ఇంకో మంచి కార్యక్రమం కూడా చేస్తున్నామని అన్నారు.


జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏరకమైన సమస్య ఉన్నా 7 రకాల టెస్టులు, 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టామన్నారు. 4వ ఫేజ్‌ హెల్త్‌ క్యాంపు, సెప్టెంబర్‌ 30వ తేదీన మొదటి హెల్త్‌ క్యాంపు, తర్వాతి 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపులు విస్తరించి పూర్తవుతాయన్నారు. గ్రామం మొత్తం మ్యాపింగ్‌ అవుతుందని... ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తామని పేర్కొన్నారు. మందులు కూడా ఉచితంగానే ఇవ్వబోతున్నామన్నారు. తర్వాత హ్యాండ్‌ హోల్డింగ్‌ చేయబోతున్నామమని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా అడుగులు వేయబోతున్నామన్నారు. మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నానంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయని, "నాట్‌ ఆల్‌ ఏంజిల్స్‌ హావ్‌ వింగ్స్‌. సమ్‌ హ్యావ్‌ స్టెతస్కోప్స్‌. కీప్‌ దిస్‌ ఇన్‌మైండ్‌" అంటూ చెప్పుకొచ్చారు.