CM Jagan Couple Participated in Sankranthi Celebrations: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం జగన్ (CM Jagan), ఆయన సతీమణి భారతితో కలిసి తాడేపల్లిలోని (Tadepalli) ఆయన నివాసంలో వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దులకు సారెలు సమర్పించారు. గోపూజ చేసిన అనంతరం.. వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అటు, సీఎం నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసిన టీటీడీ నమూనా ఆలయం ఆకట్టుకుంది. ఆ ఆలయంలో జగన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సుబ్బారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.






సంక్రాంతి శుభాకాంక్షలు


అంతకు ముందు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 'ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి, సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ శాంతులతో విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు మందుకు వేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగీ, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు.






ఘనంగా భోగి వేడుకలు


మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, పల్నాడు జిల్లాల్లోని గ్రామాల్లో ఉదయం నుంచే ప్రజలు ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. అటు, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా భోగి మంటల వద్ద డ్యాన్సులతో ఆయన సందడి చేశారు. బంజారా మహిళలతో కలిసి కాలు కదిపారు. గతేడాది సైతం ఆయన స్టెప్పులు వేయగా వైరల్ గా మారాయి. ఇప్పుడు కూడా డ్యాన్సులతో అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 










Also Read: Sankranthi Celebrations: మందడంలో ఘనంగా భోగి వేడుకలు - సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు, పవన్ సందడి