Chandrababu Naidu Dinner with the Real Winners: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సందర్భంగా అసలైన విన్నర్స్  మీరేనంటూ కీలక అధికారులకు విందు ఇచ్చారు.  డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ పేరుతో జరిగిన ఈ వేడుకలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయిలో కష్టపడిన మండల స్థాయి ఉద్యోగులను సైతం ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  రియల్ విన్నర్స్ కోసం సీఎం ఆత్మీయ విందు

Continues below advertisement

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు లభించడంలో  కీలక పాత్ర పోషించిన అధికారులే  అసలైన విజేతలు  అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.  సచివాలయంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రులు, సీఎస్, డీజీపీలతో పాటు వివిధ శాఖల అధిపతులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే అధికారులు, మంత్రులు చప్పట్లతో సీఎంకు ఘనస్వాగతం పలికారు. మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ భేటీలో, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యంత్రాంగాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

 సంస్కరణలు ఆయన డీఎన్ఏలోనే ఉన్నాయి!

Continues below advertisement

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సంస్కరణలు అనేవి చంద్రబాబు గారి డీఎన్ఏలోనే ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐటీ, టెలికాం, విద్యుత్ , డ్రిప్ ఇరిగేషన్ వంటి రంగాల్లో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులే నేటికీ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాయని గుర్తుచేశారు. గత ఐదేళ్ల సంక్షోభం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో సీఎం విజన్ మరువలేనిదని కొనియాడారు.

ఇగోలు లేని పరిపాలన.. టీమ్ ఏపీ స్పూర్తి

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  .. పరిపాలనలో కానీ, రాజకీయాల్లో కానీ ఇగోలకు పోకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి చంద్రబాబు  అని లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో పారిశ్రామికవేత్తలను ప్రసన్నం చేసుకోవడానికి తాము ఒక టీమ్‌లా, ఎలాంటి అహాలు లేకుండా పని చేస్తున్నామని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది పూర్తయ్యే వరకు అధికారులను సమన్వయం చేసే సీఎం పద్ధతి తమకు ఆదర్శమని పేర్కొన్నారు. 

 1995 కాదు.. ఇకపై 2024-29 గురించి చెప్పుకోవాలి!

గతంలో 1995-99 మధ్య జరిగిన అభివృద్ధి గురించి మనం చర్చించుకునే వాళ్లమని, అయితే ఇకపై  2024-29 పాలన  గురించి ప్రపంచం చెప్పుకునేలా పని చేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.  ఒక లక్ష్యాన్ని చేరుకోగానే సీఎం మాకు అంతకంటే పెద్ద లక్ష్యాన్ని ఇస్తారు  అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించడం అధికారుల్లో నవ్వులు పూయించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులు, అధికారులు ఒకే టీమ్‌గా పనిచేసి సరికొత్త రికార్డులను సృష్టిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 స్వర్ణాంధ్ర దిశగా భవిష్యత్తు ప్రణాళిక

డిన్నర్ కంటే ముందు జరిగిన సమావేశంలో రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిలో ఎక్కడా రాజీ పడకూడదని, సంస్కరణల ఫలాలు క్షేత్రస్థాయిలో సామాన్యుడికి చేరాలని దిశానిర్దేశం చేశారు.