Ethanol Blending India: భారత్‌ తన ఇంధన అవసరాల కోసం విదేశీ ముడి చమురుపై ఎక్కువ ఆధారపడి ఉంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొక్కల ఆధారిత ఇథనాల్ కలపడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ హరిత ఇంధన ప్రయాణంలో భారత్‌ ఒక భారీ మూల్యాన్ని చెల్లించబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Continues below advertisement

వరి, చెరకు, మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ

ఇథనాల్ ఉత్పత్తికి భారత్ ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ పంటల అత్యధికంగా నీటిని వినియోగించుకునేవి కావడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతుందని అంటున్నారు. 

లీటర్ ఇథనాల్ తయారీకి 0,790 లీటర్లు నీరు ఖర్చు 

ఒక లీటర్ ఇథనాల్‌ను వరి నుంచి  ఉత్పత్తి చేయడానికి దాదాపు 10,790 లీటర్లు నీరు అవసమవుతుంది. ఇందులో పంట సాగుకు అవసరమయ్యే సాగునీరు కూడా కలిసి ఉంది. ఒక కేజీ వరి పండించడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమైతే, ఒక లీటరు ఇథనాల్‌ తయారు చేయడానికి సుమారు 2.5 నుంచి 3కేజీల వరి అవసరం అవుతుంది. మొక్కజొన్న నుంచి ఒక లీటరు ఇథనాల్‌ ఉత్పత్తికి దాదాపు 4, 670 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. చెరకు నుంచి ఒక లీటర్ ఇథనాల్‌ పొందడానికి 3,630 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 

Continues below advertisement

ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు

ప్రభుత్వం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను సాధించడానికి ఆహార ధాన్యాల కేటాయింపును భారీగా పెంచుతోంది. 2024-25లో 52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తికి కేటాయించగా, 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో నూకల వాటాను 25 శాతం నుంచి పది శాతానికి తగ్గించి, మిగిలిన నిల్వలను నేరుగా డిస్టిలరీలకు తరలించడం ద్వారా ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో నీటి కొరత 

ఈ ఇథనాల్‌ విప్లవం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2039 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. భారత్‌ ప్రస్తుతం 1822 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్లు ఎక్కువగా మహారాష్ట్ర(396కోట్ల), ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. విచిత్రమేంటంటే ఈ ప్రాంతాలు ఇప్పటికే  తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 

కేవలం నీటి వినియోగమే కాకుండా, ఇథనాల్ మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోతే ఉపరితల జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రైతు ఒక కేజీ వి పండిస్తూ 3000 లీటర్ల నీటిని వాడుతుంటే, వనరుల వృథా అంటున్న వ్యక్తులు అదే పంటను ఉపయోగించి ఇండస్ట్రీ ఒక లీటరు ఇథనాల్‌ కోసం  పదివేల లీటర్ల నీటిని వాడుతుంటే, దానిని గ్రీన్ ఎనర్జీ అని పిలుస్తున్నారని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంధన భద్రత కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే అయినా అవి నీటి భద్రతను పణంగా పెట్టి జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటల కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో వాహనాలు నడపడానికి ఇంధనం ఉండొచ్చు కానీ మనుషులు తాగడానికి నీరు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.