Chandrababu reviews GSDP growth: విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్  ఇండికేటర్స్ పై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. 

229 నాటికి రూ.5.42 లక్షల తలసరి ఆదాయం లక్ష్యం 

తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ తో పనిచేయాలని సూచిచారు.  ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలి... కనీస అవసరాలు అందించాలి. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలి. సహజ వనరులను రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాల్నారు.  పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తూ సమన్వయంతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ఆ దిశగా అధికారులు, ఆయా శాఖలు పనిచేయాలని అని సీఎం సూచించారు.

ఉత్పత్తులకు విలువ జోడింపే కీలకం 

“వివిధ రంగాల్లో రోజువారీగా మారే పరిణామాలకు.. మార్పులకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పుల మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మన ఉత్పత్తులకు విలువ జోడింపు అనేదే కీలకం. దాని ద్వారానే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. మైనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ ప్రధానమైన అంశం. జీఎస్డీపీ వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలం. వివిధ రంగాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా కార్యాచరణ చేయాలి.” అని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల ద్వారా రూ.1,26,098 కోట్ల రూపాయల జీవీఏ వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆక్వా అనుబంధ పరిశ్రమ ద్వారా రూ.1.12 లక్షల కోట్ల మేర జీవీఓ జోడించినట్టు అధికారులు వెల్లడించారు. 

 రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం 

ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. “అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. బెటర్ సొసైటీ, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తీసుకువచ్చేలా ప్రభుత్వ శాఖలు పని చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఎలా నిర్దేశిస్తున్నారో పరిశీలించండి. ప్రతీ రంగంలోనూ ఏపీ ముఖ్య భూమిక పోషించాలి. గ్రామస్థాయి నుంచి కుటుంబం వారీగా పర్యవేక్షణ జరగాలి. లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించండి. ప్రతీ కుటుంబం తాలూకు ఆర్ధిక, ప్రజారోగ్య వివరాలు నమోదు కావాలి. ఫారెస్టు గ్రీన్ కవర్, ఎయిర్ క్వాలిటీ, తలసరి విద్యుత్ వినియోగం ఇలా అన్ని అంశాలను ఆయా శాఖలు నమోదు చేయాలి. కేవలం ఆదాయం, సంపద సృష్టికి మాత్రమే పరిమితం కావొద్దు." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 ప్రతీ విభాగానికీ ఓ ఇండికేటర్ 

 ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం అందించే 700 సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి. కేవలం 60 లక్షల జనాభా, పరిమితమైన వనరులతో సింగపూర్ దేశం అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు.  భారత్ లో 140 కోట్లకు పైగా జనాభా, అపారమైన వనరులతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. బయటి ప్రపంచం చూడకుండా మనకు మనమే తెలివైన వాళ్లని భావించుకోవడం సరికాదు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమచారాన్ని క్రోడీకరిస్తే అది అతిపెద్ద సంపద అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సమాచారాన్ని విశ్లేషించి వినియోగించుకుని ప్రభుత్వ శాఖల సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముందన్నారు.