Chandrababu  :  పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే  జిల్లాను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అరకులో రా కదలిరా బహిరంగసభలో మాట్లాడారు. పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. అందుకే గిరిజనులు కొంత కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను తీరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.                               

  


అరకులో రా కదలిరా సభలో చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  గిరిజనుల కోసం గతంలో  ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన 16 పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని   చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.  నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. గిరిజనుల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్‌కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామన్నారు.  అరకు కాఫీని తాము ప్రమోట్‌ చేస్తే.. జగన్   గంజాయిని పరిచయం చేస్తోందని మండిపడ్డారు.                          


 గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైసీపీదని..గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించా జగన్ అడ్డుపడ్డారన్నారు.  గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్‌కు ఇష్టం లేదున్నారు.  అందుకే ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం రద్దు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్‌షిప్పులు ఇస్తే.. దాన్నీ తీసేశారు. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేశారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చిన ఘనత తెదేపాది. గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్‌’’ అని చంద్రబాబు మండిపడ్డారు.                      


‘‘గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా? సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్‌ పంపలేదు. స్కూటర్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఆయన నొక్కే బటన్‌ ఒకటి.. బొక్కే బటన్‌ ఒకటి. జగన్‌ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువ. విద్యుత్‌ ఛార్జీలు ఐదు రెట్లు పెంచేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.