ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడి చేశారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారని అన్నారు. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని అన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాడని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించాడని, ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.


బాబాయ్‌నే వేసినోళ్లు బుచ్చయ్య తాత‌ని గౌర‌విస్తార‌నుకోవ‌డం వృథా - లోకేశ్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన దాడిపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజాస్వామ్య విలువ‌ల‌కి నిలువెత్తు సంత‌కంలా నిలిచే సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రిపై ప్రజాస్వామ్య దేవాల‌యం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగ‌బ‌డ‌టం దారుణం. బుచ్చయ్య తాత‌పై దాడి దేశ ప్రజాస్వామ్య చ‌రిత్రలోనే బ్లాక్ డే. ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటిన పెద్దాయ‌న‌ని చూస్తేనే చేతులెత్తి న‌మ‌స్కరించాల‌ని అనిపిస్తుంది. దాడికి మీకు మ‌న‌సు ఎలా ఒప్పింది? అధికారం కోసం సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు, బుచ్చయ్య తాత‌ని గౌర‌విస్తార‌నుకోవ‌డం వృథా ప్రయాస‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌ర్రుకాల్చి వాత పెట్టినా ఫ్యాక్షన్ బుద్ధి మార‌లేదు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.


మేం దాడి చేసుంటే ఉరి తీయండి - అచ్చెన్నాయుడు


స్పీకర్‌పై తాము దాడి చేసి ఉంటే తమను అసెంబ్లీలోనే ఉరి తీయాలని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మూడు ఎమ్మెల్సీలు గెలవడంతో వైసీపీకి మతి పోయిందని అన్నారు. 75 ఏళ్ల వ్యక్తి అయిన బుచ్చయ్య చౌదరిపై, డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడి చేయడం దారుణం అని అన్నారు. సీటులో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై మంత్రి వెల్లంపల్లి దాడి చేశారని ఆరోపించారు. ఘర్షణకు సంబంధించిన మినిట్ టూ మినిట్ వీడియోను స్పీకర్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.


అసలు ఏం జరిగిందంటే..


ఏపీ అసెంబ్లీ నేడు (మార్చి 20) ప్రారంభం కాగానే టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.