Chandrababu Linked In Update: సీఎంగా బాధ్యతలు చేపట్టారో లేదో అప్పుడే ఇంటర్నెట్‌లో బజ్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆయన బయో అప్‌డేట్ చేశారు. బిజినెస్ , ఎంప్లాయిమెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Linked In లో ఆయన చేసిన ఓ పోస్టుపై మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చర్చ జరుగుతోంది. టెక్నాలజీని వాడటంలో కానీ దానిని ప్రోత్సహించడంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడి సృష్టించే చంద్రబాబు ఈసారి కూడా తన పోస్టును అదే రీతిలో చేశారు. 


Linked In  ప్రొఫైల్ పై చర్చ 
ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తన సోషల్ మీడియా అకౌంట్లన్నింటిలోనూ ప్రొఫైల్ ను అప్‌డేట్ చేశారు. అలాగే తన లింక్‌డ్‌ ఇన్ లో మాత్రం ఓ పోస్టు పెట్టారు. ఇటీవల ఎన్నికల ఫలితాల్లో తమ TDP-BJP-JSP కూటమి 164 స్థానాలు సాధించిందని ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆ పోస్టులో పేర్కొన్నారు. తమ మూడు పార్టీల కూటమిలో ప్రజలు నాలుగో పార్టీగా చేరారని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని ఆయన రాసుకున్నారు.


Xలో షేర్ చేసిన మహిళ


దీనిని రాధికా ధని అనే ఓ టెకీ Xలో పోస్ట్ చేశారు. చంద్రబాబు తన ప్రొఫైల్ నెట్‌వర్కింగ్ చేస్తున్నట్లు లేదని తన Resume ను అప్‌డేట్ చేసినట్లు ఉందని ఆమె వ్యాఖ్య చేశారు. దానిపై చాలా మంది టెకీలు కామెంట్లు చేశారు. చంద్రబాబు 1995 నుంచి హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన్ను ఏపీ సీఎం అని కాకుండా CEO అని పిలుచుకుంటారని కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబుకు వచ్చిన అవార్డులు, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు చేసిన కవరేజ్ వంటివి ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్ 2లక్షల 70వేల మందికి చేరువైంది. చంద్రబాబు తనను రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరని ఈ పోస్ట్ తో అర్థమవుతోంది. 


రాజకీయ నాయకులు సహజంగా Facebook, X వంటి వేదికలను వాడుతుంటారు. Linked In లాంటి ప్రొఫెషనల్ వేదికలు ఉపయోగించడం తక్కువ. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్, టెక్ సంబంధిత వ్యక్తులు ఇందులో ఉంటారు. అలాగే ఉద్యోగార్థులు ఎక్కువగా దీనిని వాడుతుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేవారు. విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సులూ నిర్వహించారు. ఎక్కువ మంది బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం కోసం ఆయన లింక్‌డ్‌ ఇన్ వాడుతున్నారు.


చంద్రబాబు 1995లో సీఎం అయినప్పటి నుంచి టెక్నాలజీ సీఎంగానే పేరు తెచ్చుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం ద్వారా హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధిని వేగవంతం చేశారనే పేరుంది.  ఆయన టైమ్ లోనే హైదరాబాద్ కు మైక్రోసాప్ట్ వచ్చింది. ISB, IIIT వంటి సంస్థలు రావడంతో చంద్రబాబు టెక్‌ సీఎం అనే పేరు స్థిరపడి పోయింది. ఆయన కూడా దానిని ఎక్కువుగా ఇష్టపడేవారు.