TG DSC 2024 Eligibility Qualifying Marks Percentage: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల (Teacher Posts) భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి (TS DSC) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీలో కనీస మార్కుల శాతాన్ని తగ్గించింది. డీఎస్సీకి పోటీపడే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇకపై డిగ్రీలో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరులో జారీచేసిన (జీవో నం.25)ఉత్తర్వులను సవరిస్తూ.. తాజాగా విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మరోసారి ఉత్తర్వులు(జీవో నం.14) జారీచేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అన్ని సబ్జెక్టుల్లోనూ, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), లాంగ్వేజ్‌ పండిట్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల్లో మార్కుల శాతాన్ని తగ్గించినట్టు వెల్లడించింది.


ఇప్పటిదాకా స్కూల్‌ అసిస్టెంట్‌ (School Assistant), భాషా పండిట్లు (Language Pandit), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు (PET) పోస్టులకు జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి ఇతర కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కుల నిబంధన ఉండేది. అయితే జనరల్ అభ్యర్థులకు 45 శాతంగా, ఇతరులకు 40 శాతానికి కుదిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం మార్పులు చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.


డీఎస్సీ అభ్యర్థులకు 'ఎడిట్' ఆప్షన్..
డీఎస్సీ-2024 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'టెట్' మార్కుల వివరాల సమర్పణ కోసం 'ఎడిట్' ఆప్షన్‌ను విద్యాశాఖ అందుబాటులో తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ టెట్ స్కోర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను కూడా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. అదేవిధంగా టెట్‌-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒక‌సారి డీఎస్సీ ప‌రీక్షకు ఉచితంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ప్రభుత్వం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటివరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేకపోయిన, కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.


జూన్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే.  ఈ నోటిఫికేషన్ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) - 6,508 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ - 2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 727 పోస్టులు, పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు) - 182 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్(స్కూల్ అసిస్టెంట్) - 220 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్(ఎస్జీటీ) - 796 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా.. దరఖాస్తుకు జూన్ 20 వరకు అవకాశం కల్పించారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య దాదాపు 2.2 లక్షల వరకు ఉంది. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడటంతో.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.   


జులై 17 నుంచి పరీక్షలు..
టెట్-2024 ప్రక్రియ పూర్తికావడంతో.. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. 


తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..