Chandrababu Naidu spoke in Assembly on projects and water disputes :  రాష్ట్ర భవిష్యత్తు నీటి లభ్యతపైనే ఆధారపడి ఉందని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, ఈ వృధాను అరికట్టి రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

Continues below advertisement

నదుల అనుసంధానం - ప్రాజెక్టుల పునరుద్ధరణ 

వంశధార నుండి పెన్నా వరకు రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా వివాదాస్పదం అవుతున్న పోలవరం-నల్లమల సాగర్  లింక్ ప్రాజెక్టుపై ఆయన కీలక వివరణ ఇచ్చారు. వృధాగా పోయే నీటినే తాము వాడుకుంటున్నామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదని, పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమే కలుగుతుందని ఉద్ఘాటించారు. గంగా-కావేరీ అనుసంధానం తన చిరకాల స్వప్నమని, ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.       

Continues below advertisement

గత ప్రభుత్వ వైఫల్యాలు - భవిష్యత్తు కార్యాచరణ 

గత ఐదేళ్లలో సాగునీటి రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడం మానవ తప్పిదమేనని, వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. అయితే, ఆ వైఫల్యాలను సరిదిద్ది, వచ్చే ఏడాది జూలై నాటికి వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించి, దశలవారీగా పనులు పూర్తి చేస్తామని, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి ఏలూరు, కృష్ణా జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.     

భూగర్భ జలాలే నిధులు - ప్రజా భాగస్వామ్యం 

సాంకేతికతను జోడించి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 7 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతోందని, దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి రూ. 91 కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. నీటి నిర్వహణ బాధ్యతలను మళ్ళీ నీటి వినియోగదారుల సంఘాలకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా, తెలుగు తల్లికి  జలహారతి ఇచ్చేలా ఒక పక్కా బ్లూ ప్రింట్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తన ప్రసంగంలో స్పష్టం చేశారు.