Chandrababu is giving party positions to leaders who do not get tickets :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీనియర్ నేతలకు పార్టీ పదవుల్ని ప్రకటించారు. వీరంతా వివిద స్తానాల్లో పని చేసుకుంటూ పోటీకి ప్రయత్నాలు చేసిన వాళ్లే. అయితే పొత్తుల్లో భాగంగా వారు త్యాగాలు చేయాల్సి రావడంతో.. వారికి  పార్టీ పరమైన ప్రాధాన్యత ఇచ్చారు.                                     


రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఆయన రామచంద్రాపురం టిక్కెట్ ఆశించారు. ఆ స్థానం జనసేన పార్టీకి ఇవ్వకపోయినప్పటికీ వాసంశెట్టి సుభాష్ అనే  యువనేతకు అవకాశం కల్పించారు. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యం అసంతృప్తికి గురి కాకుండా పొలిట్ బ్యూరో పదవి ఇచ్చారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ప.గో జిల్లా కొవ్వూరుకు చెందిన జవహర్ కు సొంత పార్టీలో అసమ్మతి ఎక్కువ కావడంతో టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ  కోసం పని చేసేలా కీలక పదవి ఇచ్చి బుజ్జగించారు.                                


ఇక విశాఖపట్నం పార్లమెంట్ అెధ్యక్షులుగా గండి బాబ్జీని నియమించారు. పార్టీ తొలి జాబితా ప్రకటించిన రోజున ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.  గాజువాక సీటును ఆయన ఆశించారు. ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత  విశాఖ పార్లమెంట్ అభ్యర్తి భరత్ ఆయనను బుజ్జగించి  రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇప్పుడు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. ఇక హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులుగా బీవీ వెంకటరాముడిని నియమించారు. ఆయన గుంతకల్లు లేదా హిందూపురం ఎంపీ టిక్కెట్ ను ఆశించారు.                    


సీఎం రమేష్ పార్టీ మారినప్పటికీ టీడీపీలోనే ఉన్న సీఎం సురేష్ కూడా కడప జిల్లాలో ఏదో ఓ సీటు ఆశించారు. ఆయనకు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చి బుజ్జగించారు. డోన్ సీటు ఆశించిన మన్నె సుబ్బారెడ్డికి సమీకరణాల్లో భాగంగా  సీటు కేటాయించలేకపోయారు. ఆయనకూ పార్టీ కార్యనిర్వహాక కార్యదర్శి పదవి ఇచ్చారు. కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురె్డ్డి ఏసుదాసులకు పార్టీ పదవులు ఇచ్చారు.                     


టిక్కెట్లు రాని మరికొంత మంది నేతలు కూడా అసంతృప్తికి గురయ్యారు. ఏలూరు ఎంపీ టిక్కెట్ ఆశించిన మాగంటి బాబు తనకు అన్యాయం జరిగిదంని వాపోయారు. ఆయనకు ఎంపీ టిక్కెట్ కాకపోతే కైకలూరు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ  కైకలూరు బీజేపీకి వెళ్లింది. దీంతో ఆయన అసంతృప్తి గురయ్యారు.  ఆయనతో వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.