Law and Order White Paper :  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలోనే విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  గురువారం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా వేశారు.  నేరుగా అసెంబ్లీలోనే ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  ఆర్థిక, ఎక్సైజ్‌శాఖలపై శ్వేతపత్రాలు కూడా..అసెంబ్లీలోనే పెట్టాలని ఏపీ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  22వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమవేశాలు జరగనున్నాయి. 


వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి వాటిపై   శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించాలనుకున్నారు. దాడులు చేసిన వారిని వదిలి పెట్టడం .. బాధితులపైనే కేసులు పెట్టడం వంటి వాటిని వెల్లడించాలనుకున్నారు.  సోషల్ మీడియా కేసుల ద్వారా భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరును శ్వేతపత్రంలో వెల్లడించేందుకు రెడీ అయ్యారు.                       


ప్రభుత్వన్ని ప్రశ్నించే  సాధారణ పౌరుల పైనా కేసులు నమోదు చేసిన వ్యవహారం,  దళితుల లపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలనూ ప్రస్తావించేలా నివేదిక రూపొందించారు.  అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి ని ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారు. ల వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు.   ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు.                                                      


ఇవన్నీ అత్యంత సున్నితమైన విషయాలు కావడంతో.. నేరుగా అసెంబ్లీ ద్వారా ప్రజల ముందుకు తీసుకు వెళ్తే బాగుటుందని అనుకున్నారు.  తఏపీలో ఏం జరుగుతున్నా  అది టీడీపీ నేతలే చేస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్న వైసీపీ వాదనకు అసెంబ్లీ వేదికగానే కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.                                               


ఐదేళ్ల కాలంలో  టీడీపీ నేతలు, కార్యకర్తలు వేల మంది అక్రమ కేసులకు గురయ్యారని టీడీపీ ఆరోపిస్తూ ఉంటారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చిన్న ఆధారం లేకపోయినా చంద్రబాబును జైల్లో పెట్టారని అంటూ ఉంటారు. అలాంటి  తప్పుడు కేసులు సహా మొత్తం వివరాలు అసెంబ్లీలో ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇరవై రెండు నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.