AP Legislative Council: ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం అయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం దూరంగా ఉండడంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. దీంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు తన ఛాంబర్‌లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు పాల్గొన్నారు.


జగన్ ను కలిసిన బొత్స
ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకగ్రీవం కావడంతో బొత్స సత్యనారాయణ తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను జగన్‌ అభినందించారు.


నేనే జగన్ ను కోరా
అయితే, ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేయడంపై లేళ్ల అప్పిరెడ్డి స్పందించారు. బొత్స సత్యనారాయణకు ఆ అవకాశం కల్పించాలని వైఎస్‌ జగన్ ను తానే కోరానని అన్నారు. దీనిపై లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫ్లోర్‌ లీడర్‌ పదవి సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు ఇస్తే బాగుంటుందని నేనే జగన్ ను కోరానని అన్నారు. మరోసారి ఆలోచించుకోమని జగన్‌ చెప్పారని.. ఆ పదవిలో సీనియర్‌ లీడర్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని అన్నారు


వైసీపీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్‌ జగన్ వెంటే ఉన్నానని లేళ్ల అప్పిరెడ్డి గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉందని అన్నారు. జగన్ వల్ల తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయని.. గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా జగన్ వలనే నియమితులయ్యానని అన్నారు. ఎమ్మెల్సీ కూడా అయనే ఇచ్చారని చెప్పారు. అలాంటి అవకాశాలు జగన్ తనకు ఇస్తూనే ఉంటారని అన్నారు. బొత్స సత్యనారాయణకు నా అభినందనలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలలో బొత్స ఏకగ్రీవం కావడం చాలా సంతోషం అని లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు.