Tipu Sultan Circle Controversy Kadapa: కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో జరిగిన దాడులు , ఉద్రిక్తతల వెనుక తీవ్రమైన కుట్ర కోణం ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలు కేవలం స్థానిక వివాదాలు కావని, దీని వెనుక కేరళకు చెందిన నిషేధిత మత సంస్థల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడులపై పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Continues below advertisement

 నిషేధిత సంస్థల హస్తంపై విచారణ 

SDPI, PFI వంటి నిషేధిత సంస్థల ప్రమేయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం  ఏర్పాటు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ , ప్రణాళికాబద్ధమైన కుట్రలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు నేతలు నిందితులకు మద్దతుగా నిలవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

ఆత్మకూరు ఘటనను గుర్తు చేస్తూ.. 

గతంలో కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ కేసులో నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి శక్తులు రెచ్చిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు కేసును అప్పట్లో మూసివేసిన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి అలసత్వమే ఇప్పుడు కడపలో పరిస్థితులు విషమించడానికి కారణమైందని ఆయన విశ్లేషించారు. 

 ప్రభుత్వానికి విజ్ఞప్తి 

ప్రజా ఆస్తుల ధ్వంసం , సామాన్య ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని బీజేపీ నేత కోరారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను, వారికి ఆర్థికంగా సహకరిస్తున్న వారిని బయటకు తీయాలని ఆయన కోరారు. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి రాష్ట్రంలో అశాంతిని నింపాలని చూసే వారిని వదిలిపెడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.