CM Chandrababu supports PM Modi Seven Appeals : దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏడు విజ్ఞప్తులు జాతీయ మిషన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పూర్తి మద్దతు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతి భారతీయుడు ఈ పిలుపును ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
సంక్షోభ సమయంలో స్వావలంబనే మార్గం
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు భారతదేశం తన వనరులను పొదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రధాని చేసిన సూచనలను ఆయన సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్న తరుణంలో, యుద్ధంతో నేరుగా సంబంధం లేని దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో పొదుపు మంత్రమే మనల్ని కాపాడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సమర్థించిన ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలు
ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా సూచించిన అంశాలను చంద్రబాబు పారిశ్రామికవేత్తల ముందుకు తెచ్చారు
1. వర్క్ ఫ్రమ్ హోమ్: ప్రయాణ ఖర్చులు తగ్గించి, సమయాన్ని ఆదా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.2. బంగారు కొనుగోళ్ల వాయిదా: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కొంతకాలం బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలి.3. పొదుపుగా ఇంధన వినియోగం: వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలి.4. సహజ సిద్ధమైన వ్యవసాయం: రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి.5. స్వదేశీ ఉత్పత్తుల వాడకం: దిగుమతులపై ఆధారపడటం తగ్గించి మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలి.6. వంట నూనెల పొదుపు: విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెల వాడకాన్ని తగ్గించాలి.7. విదేశీ పర్యటనల నియంత్రణ: కనీసం ఏడాది పాటు విదేశీ విహారయాత్రలను వాయిదా వేసుకోవాలి.
పారిశ్రామికవేత్తలకు పిలుపు
పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ఈ సంస్కరణలను కేవలం ప్రధాని బాధ్యతగా మాత్రమే చూడకండి. ఇది మన దేశం పట్ల మనకున్న ధర్మం. భారత్ ఒక తిరుగులేని శక్తిగా ప్రపంచ వేదికపై ఎదగాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరం అని చంద్రబాబు అన్నారు. సవాళ్లు ఎప్పుడూ కొత్త అవకాశాలను తీసుకొస్తాయని, ప్రస్తుత కష్టాలను దాటుకుని భారతదేశం మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్తల ముందు తన విజన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలబెడతామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తామని, అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమిత్ షా, సి.ఆర్. పాటిల్తో కీలక చర్చలు
అంతకు ముందు రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఆయన, విభజన హామీల అమలు మరియు పెండింగ్లో ఉన్న నిధుల విడుదలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ను కలిసి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు , రెండో దశ నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, దీనికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు అధికారులతో కూడా భేటీ అయ్యారు.
