Repalle News : కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫైర్

ABP Desam   |  Satyaprasad Bandaru   |  17 Jul 2022 03:06 PM (IST)

Repalle News : 'నా నియోజకవర్గంలో తిరిగే హక్కు నాకు లేదా? ఒక టెర్రరిస్టు ఇంటి ముందు మోహరించినట్లు భారీగా పోలీసులు దింపుతారా?' అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హౌస్ అరెస్ట్

Repalle News : బాపట్ల జిల్లా రేపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. రేపల్లె ఎమ్మెల్యె అనగాని సత్యప్రసాద్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేపల్లె మండలం పోటు మెరక  గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృతి చెందారని టీడీపీ ఆరోపిస్తుంది. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లేందుకు రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన చేశారు. 

అనగాని ఫైర్ 

పోలీసులు తీరును ఎమ్మెల్యె అనగాని సత్య ప్రసాద్ తప్పుబట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని ఆరోపించారు.  ప్రజా వ్యతిరేకతపై మాట్లాడితే సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుంటుందని మండిపడ్డారు. ఒక శాసన సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు వెళ్లి పరామర్శించే హక్కు తనకుందన్నారు. తన హక్కులను కాలరాసే విధంగా గత అర్ధరాత్రి నుంచి తన ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని ఆరోపించారు.  ఒక టెర్రరిస్టు ఇంటి ముందు పోలీసులు మోహరించినట్లు తన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వెయ్యి మందిపై మానభంగాలు, దొంగతనాలు, మర్డర్లు జరిగాయని, వాళ్లను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు కానీ రేపల్లె ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు.  

ప్రభుత్వానిదే బాధ్యత 

ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలకు  ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మరణించిన నాంచారయ్య, రత్తయ్య ఇద్దరి కుటుంబాలను మా పార్టీ తరఫున ఆదుకుంటాం. పోటు మెరకలో మద్యం తాగి  మరణించిన ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలి. అలాగే అనారోగ్యం పాలై హాస్పటల్ లో ఉన్న వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. మీరు అమ్ముతున్న మద్యం తాగి మరణించారు కాబట్టి ప్రభుత్వం పైన కేసు నమోదు చేయాలి.  - - అనగాని సత్యప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే 

అన్నీ స్కామ్ లే 

రాష్ట్రంలో అన్ని స్కామ్ లే జరుగుతున్నాయని సత్యప్రసాద్ ఆరోపించారు. ధన దాహంతో పేద ప్రజల మాన ప్రాణాలను హరిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై ఉద్యమిస్తామన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన నకిలీ మద్యం మరణాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామన్నారు. వైసీపీ నేతల జేబులు నింపుకోవడం కోసమే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారని మండిపడ్డారు. 

Published at: 17 Jul 2022 03:05 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.