KCR Bhadrachalam Tour: భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రస్తుతం 70 అడుగుల వరకూ చేరిందని భవిష్యత్తులో 80, 90 అడుగులకు చేరినా ఇబ్బంది లేకుండా, ఈ కాలనీల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రూ.వెయ్యి కోట్లతో 2 నుంచి 3 వేల ఇళ్లు ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో గంగా నది వరదల సమయంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన సాంకేతిక విధానాలను అవలంబించాలని సూచించారు. అవసరమైతే ఐఐటీ ప్రొఫెసర్ల సాయం తీసుకోవాలని నిర్దేశించారు. మొత్తానికి భవిష్యత్తులో వరద సమస్య లేకుండా చేస్తామని చెప్పారు.


వరద సాయం ప్రకటన
తక్షణ సాయం కింద వరద బాధితులకు రూ.10 వేలు సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా మరో రెండు నెలల పాటు కుటుంబానికి ఉచితంగా 20 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు. 


వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. అనంతరం సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.


భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు ఆశ్చర్యాలకు లోనయ్యారు. ద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.


శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం - కేసీఆర్
తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.