Bandla Ganesh severely criticized Roja : ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాలపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్ అన్నారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని.. సీఎం జగనే యాక్సిడెంటల్ సీఎం అన్నారు. రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ అన్నారు. భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నాన్న చనిపోతేనే, నాన్న వారసత్వంతోనే సీఎం అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారన్నారు. పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అన్నారు. రేపోమాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రొగ్రామ్‌లు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాకు లేదన్నారు. రోజా ఐటం రాణి అని బండ్లగణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.                                                                     


ఇటీవల ఏపీలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని విమర్శించారు. సందర్భం లేకపోయినా రేవంత్ రెడ్డిని విమర్శించడంతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ పై రోజాపై విరుచుకుపడ్డారు. గతంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ బండ్ గణేష్ రోజాతో పలుమార్లు వాగ్వాదానికి దిగారు. శృతి మించి విమర్శలు చేసుకున్నారు. రోజా ప్రయోగించే భాషపైనే చాలా విమర్శలు ఉంటాయనుకుంటే.. బండ్ల గణేష్ అంత కంటే ఎక్కువగా కౌంటర్ ఇచ్చేవారు. దాంతో వారి వివాదాలు హాట్ టాపిక్ అవుతూంటాయి.            


 ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని... పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని... వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్న కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు. కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని అన్నారు.