YS Viveka Case Update :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు బుధవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. సీబీఐ కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిని తీసుకుని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ముగుర్ని కలిపి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రెండు గంటల పాటు ముగ్గుర్నీ కలిపి ప్రశ్నించి.. ఆ తర్వాత విడివిడిగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.  వివేకా హత్య జరిగిన తరువాత అసలు ఏం జరిగింది..?హత్య చేసిన నిందితులు భాస్కర్ రెడ్డి ఇంటికి  రావడానికి కారణం ఏంటి..? అన్న అంశాలపై ప్రధానంగా వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. 


అప్రువర్ దస్తగిరి ఇచిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు ముగ్గుర్ని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.  హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు ఎందుకు తారుమారు చేశారు...? హత్యకు ముందు హత్యకు తరువాత ఎక్కడున్నారు...? గంగిరెడ్డి తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు.  ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పరిచయం.. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా  నిందితుల కదలికలు పసిగట్టిన సీబీఐ పలు కొన్నాలో విచారణ జరిగినట్లు సమాచారం. 25వ తేదీ వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అవినాష్ రెడ్డిని   రోజూ సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశిచింది. ఈ కారణంగా గురువారం కూడా సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. 


అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీ కూడా మరో ఐదు రోజుల పాటు ఉంది. మొత్తం ఆరు రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ ప్రకారం ఆరు రోజుల పాటు ఇరువురిని సీబీఐ ఆఫీసుకు తీసుకు వచ్చి.. అవినాష్ రెడ్డితో కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును న్యాయమూర్తి 24వ తేదీన ఇస్తారు. ఒక వేళ ముందస్తు బెయిల్ ఇస్తే అవినాష్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకున్నట్లే అవుతుంది. ముందస్తు  బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే సీబీఐ వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 


మరో వైపు దస్తగిరి  ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని   కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.   తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం తనకు ఉందని చెప్పారు. అవినాశ్ రెడ్డి మనుషులు తనను అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు.