Atchannaidu suspects Jagan hand behind YS  death:  జగన్ రెడ్డి సైకో మనస్తత్వానికి, పదవీ కాంక్షకు ఆయన కుటుంబ సభ్యులే బలైపోయారని అచ్చెన్నాయుడు విమర్శించారు.  అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.   జగన్ మోహన్ రెడ్డి పదవీ వ్యామోహం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని, ఆయన నైజం చూస్తుంటే గతంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు నాడు వ్యక్తమైనా, సభ్య సమాజంలో ఎవరైనా తండ్రికి అలా చేస్తారా అని తాము నమ్మలేదని, కానీ ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే తాను సీఎం కాలేనని భావించిన జగన్, తండ్రిని మానసిక క్షోభకు గురిచేశారని, అందుకే ఆయనను బెంగళూరుకు పంపారని రోశయ్య  కూడా చెప్పారని గుర్తుచేశారు. వైఎస్సార్ మరణం ఇంకా నిర్ధారణ కాకముందే సంతకాల సేకరణ చేపట్టడం, మరణించిన రోజే పోలవరం టెండర్లను ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం చూస్తే ఆయనకు తండ్రి కంటే పదవి, పైసలే ముఖ్యమని అర్థమవుతోందని మండిపడ్డారు.

Continues below advertisement

తండ్రి, బాబాయి మరణాలతో లబ్ది  పొందిన జగన్

సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు సింపతీతో పార్టీ పెట్టుకుని, వివేకా చనిపోయినప్పుడు ఆ నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టి ముఖ్యమంత్రి అయ్యారని.. ఇలా తండ్రి, బాబాయి మరణాల వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని విమర్శించారు. పదవి కోసం తల్లిని, చెల్లిని కూడా రోడ్డు మీదకు పంపిన వ్యక్తిత్వం ఆయనదని, తండ్రి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్‌ది అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చివరికి సొంత చెల్లి షర్మిల అసలు వైఎస్సార్‌కే పుట్టలేదంటూ సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టించారని, ఇలాంటి వ్యక్తికి ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని నిలదీశారు.

Continues below advertisement

మావిగన్ ప్రతిపాదనతో జోకర్ 

రాష్ట్ర అభివృద్ధిని జగన్ పూర్తిగా నాశనం చేశారని, 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని తాము 22 నెలల కాలంలోనే సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని మంత్రి పేర్కొన్నారు. గతంలో అమరావతికి అంగీకారం తెలిపి, అక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా  మావిగన్  అనే వింత ప్రతిపాదన తెచ్చి ప్రజల్లో జోకర్ లాగా మిగిలారని ఎద్దేవా చేశారు. వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ఈ ప్రతిపాదన చూసి నవ్వుకుంటున్నారని, జగన్ తరహాలోనే ఆ పార్టీ నేతలు కూడా  పిచ్చోళ్లలా  తయారయ్యారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో కాలికి గజ్జె కట్టుకుని మరీ చెబుతామని, జగన్ మాత్రం కేవలం విధ్వంసానికే పరిమితమయ్యారని మండిపడ్డారు.   

రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు జగన్

జగన్ మోహన్ రెడ్డిని సమాజానికి ఒక  చీడపురుగు గా అభివర్ణించిన అచ్చెన్నాయుడు, ఆయనకు మళ్ళీ అధికారం వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వంటి జర్నలిస్టులను టార్గెట్ చేయడంపై మండిపడుతూ, జగన్ తన సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను వ్యభిచారులు అని అవమానించినప్పుడు, చంద్రబాబు భార్య భువనేశ్వరి  పై అసభ్య వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ విజ్ఞత ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు తిప్పుతానంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను తాము గతంలోనే చూశామని, అక్రమ సంపాదనతో నిర్మించిన ప్యాలెస్‌లలో ఉంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పదవి కోసం ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న జగన్ నైజాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.