Chandrababu Case :  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేశారు. రెండు రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. 


ఉదయం నుంచి ఇరుపక్షాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ,  రంజిత్ కుమార్,  ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూధ్రా వాదించారు. హోరాహోరీగా సాగిన వాదనల్లో కొన్ని కీలక అంశాలను ఇరు పక్షాలు లెవనెత్తాయి. ఇది పూర్తిగా రాజకీయ  కుట్ర తో పెట్టిన కేసు అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. పలు ఉదాహరణలు చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదన్నారు. పైగా అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో చేశారని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. అరెస్ట్ చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్నారు. ఈ సందర్భంగా పలు కేసులను హరీష్ సార్వే న్యాయమూర్తికి వివరించారు. అర్నాబ్ గోస్వామితో పాటు రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనూ వివరించారు. 


మరో వైపు ప్రభుత్వం తరపు లాయర్లు వాదనల్లో తడబడినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు తప్పు చేశారన్న దానికి తమ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని లాయర్ రంజిత్ కుమార్ చెప్పడం కీలక మలుపుగా భావిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి పది రోజులే అయిందని ఇంకా దర్యాప్తు జరుగుతోందని వాదించారు. స్కిల్ కాంట్రాక్టు పొందిన డిజైన్ టెక్.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని వారు నిధులు దారి మళ్లించారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయూమూర్తి  ఆ సబ్ కాంట్రాక్టర్లతో పిటిషనర్‌కు అంటే.. చంద్రబాబుకు సంబంధం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. దీనికి నేరుగా సమాధానం చెప్పలేకపోయిన ప్రభుత్వ లాయర్ రంజిత్ కుమార్.. వేరే కేసులో చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసుల్ని చూపించారు. 


గుజరాత్ లోనూ ఇలాంటి ప్రాజెక్టు చేపట్టారని..అక్కడి కంటే ఇక్కడ చాలా ఎక్కువ రేటు పెట్టారని.. వివరాల కోసం ఈమెయిల్ చేశామన్నారు. ఇంకా సమాచారం రాలేదన్నారు. అలాగే సిమెన్స్ విషయంలోనూ ఈమెయిల్ చేశామని ఇంకా డీటైల్స్ రావాల్సి ఉందన్నారు. వచ్చే శుక్రవారం మరో కౌంటర్ దాఖలు చేస్తామని రంజిత్ కుమార్ చెప్పారు. అయితే న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ రోజే వాదనలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో డబ్బులు గోల్ మాల్ అయ్యాయంటున్నారని.. కానీ మొత్తం ఒప్పందానికి తగ్గట్లుగా స్కిల్ సెంటర్లు పెట్టారని.. మొత్తం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ టూల్ డిజైన్ సహా ఆరు వ్యవస్థలు భాగమయ్యాయని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. 
 
రిమాండ్ రిపోర్టులో ఉన్నవి, ప్రెస్ మీట్లలో సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినవి .. కూడా ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టులో చెప్పారు.  సుదీర్ఘంగా సాగిన వాదనలు.. సాయంత్రానికి ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు.  రెండు రోజుల్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.