AP Skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టింది. 2014- 19 మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఈడీ భావిస్తుంది.  స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ లకు ఈడీ తాజాగా నోటీసులు  జారీ చేసింది.


రూ.234 కోట్లు దారిమళ్లింపు 


టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంపై ఈడీ వేగంపెంచింది. ఈ కేసులో నిందితులకు ఉన్న 26 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో మొత్తం రూ.234 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ కేసు నమోదు చేసింది. పూణెకి చెందిన పలు కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు ఈడీ భావిస్తుంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ఈ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరితోపాటు ఓఎస్‌డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్ కు నోటీసులు ఇచ్చింది. హైదరాబాదులోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. 


సీఐడీ కేసు నమోదు


ఈ కేసులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలకు కూడా చేశారు.  


అసలేం జరిగింది?


ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది.  2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వానికి  విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది.