అమరావతి: రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Continues below advertisement

ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు..సోమవారం (17-11-2025) నాడు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ . అదే సమయంలో, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంమరుసటి రోజు, మంగళవారం (18-11-2025) నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరియు ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

Continues below advertisement

ఈ 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..ప్రస్తుత అల్పపీడనం నుంచి కోలుకునేలోపే ఏపీపై మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం, ఈ రెండవ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.