Chandrababu Comments in TDP Parliamentary Meeting: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం గురువారం (జూన్ 6) అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై మీరంతా మారిన చంద్రబాబును చూస్తారని అన్నారు. చంద్రబాబు మారరు.. ఎవరి మాట వినరు అనే మాట ఇక వినిపించబోదని అన్నారు. ఇకపై తనను ఎంపీలు తరచూ కలుస్తూ ఉండాలని కోరారు. ఎంత బిజీగా ఉన్నా పక్కకు వచ్చి మరీ ఎంపీలతో మాట్లాడతానని అన్నారు. రాష్ట్రంలో ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండబోదని.. పూర్తి రాజకీయ పాలన  తెస్తామని అన్నారు.


‘‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు - అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. 


ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి - నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ సమావేశంలో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన నేతలకు సూచించారు.


మీడియాతో కొత్త ఎంపీలు
పార్లమెంటరీ భేటీ తర్వాత టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మోదీ, చంద్రబాబు, పవన్ కృషి వల్లే భారీ విజయం నమోదైందని అన్నారు. తెలుగు ప్రజల్లో ఉన్న కసి కూడా భారీ విజయానికి కారణం
ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో ప్రయాణిస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాల్సి ఉందని అన్నారు.