Latest Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి క్రమంగా వలసలు మొదలు అవుతున్నాయి. ఇప్పటికే కింది స్థాయిలో కౌన్సిలర్లు వైసీపీని వీడుతుండగా.. ఇప్పుడు పై స్థాయి నేతలు కూడా జగన్ కు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మద్దాలి గిరి గెలిచారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 


తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడినందున చాలా మంది నేతలు పార్టీ మారుతున్నట్లుగానే మద్దాలి గిరి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీ క్రియాశీలక సభ్యతానికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.