YS Sharmila Comments: ఏపీ కాంగ్రెస్ తరపున కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా బాగా పర్యటనలు చేస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 8) కూడా వైఎస్ షర్మిల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర నిర్వహించారు. ఇంకా వివిధ వర్గాల వారిని కూడా కలిశారు. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతుండగా.. ఓ యువకుడు సీఎం జగన్ పై నినాదాలు చేశాడు. అతణ్ని షర్మిల పిలిచి జగన్ కు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని అడిగి మైకు ఇచ్చారు.


మైకు తీసుకున్న జగన్ అభిమాని తమ నాయకుడికి ఎందుకు ఓటు వేయాలో చెప్పాడు. ‘‘2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతానే ఉండాడు. సమస్యలేమున్యా మాకోసం వచ్చినాడు.. విన్యాడు.. నేను ఉండానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం.. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి వాళ్ల కష్టాలు విన్యాడు. విని.. వాళ్లకు న్యాయం చెస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా అందరికి న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి సంక్షేమం అందింది. అందుకు కారణం జగన్ మోహన్ రెడ్డి గారే.. జగన్ మాట చెప్పినాడంటే.. ఆ మాట నెరవేరుస్తారు. ఆయన మాకోసం ఉంటాడు కూడా.. మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ సమస్యలేవో మీకు ఉన్నాయి.. అక్కా (షర్మిల). మొన్న మీరు తెలంగాణలో మీకోసం ఉంటాను.. పోటీ చేస్తానని చెప్పినారు. అక్కడ పోటీ చేయలేదు. ఇక్కడికి వచ్చారు. అయినా మీమీద మాకెంతో గౌరవం ఉంది రాజశేఖర్ రెడ్డిగారి బిడ్డగా మిమ్మల్ని మేం అభిమానిస్తాం అక్కా. కానీ, జగన్ మోహన్ రెడ్డి గారు మాకోసం ఉన్నారు అక్కా’’ అని ఆ యువకుడు ఆవేశంతో మాట్లాడాడు.






అతని నుంచి మైకు అందుకున్న వైఎస్ షర్మిల ఆ యువకుడి మాటలకు కౌంటర్ ఇచ్చారు. నువ్వు అభిమానించే వ్యక్తి కోసం నేను 3,200 కిలోమీటర్లు నడిచా.. అలాంటి సొంత చెల్లి బతుకే రోడ్డున పడేశాడు జగనన్న.. ఇక మీరెంత’’ అంటూ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.