New Voters Register : కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ఓ ప్రకటన చేశారు. 2023 జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వీరితోపాటు వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే, జులై, అక్టోబరు ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారు కూడా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ల నమోదు, తొలగింపునకు సంబంధించి ఆగస్టు 4 నుంచి అక్టోబరు 24 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు 3, 4 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల నమోదు కోసం బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని ముఖేశ్ మీనా స్పష్టం చేశారు. 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటర్లు నమోదు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 


కొత్త మార్గదర్శకాలు 


 ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలుకానున్నాయని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని మీనా తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం-8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం-8 వినియోగించనున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 


ఓటర్ల జాబితా నుంచి తొలగించం 


నూతన చట్ట సవరణలు అనుగుణంగా ఓటర్లు 2023 ఏప్రిల్ నాటికి తమ ఆధార్ నంబర్ ఓటర్ ఐడీతో జత చేయాలని ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబర్ ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా నమెదైన వారి ఆధార్ నంబర్ కోసం కొత్తగా ఫారమ్ 6B ప్రవేశపెట్టామన్నారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ వెబ్ సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంటుందన్నారు. 6B దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘానిరి సమర్పించవచ్చన్నారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్ లైన్ యాప్ అనుసరించి యుఐడీఐఎతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీని ఉపయోగించి ఆధార్ నంబర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేయవచ్చారు.