అమరావతి: దేవాదాయ ధర్మాదాయ శాఖ పనుల టెండర్లలో పారదర్శకతకు పెద్దపీఠ వేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో మంత్రి కొట్టు మాట్లాడారు.  అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు పనుల్లో పారదర్శకతకు పెద్దపీఠ వేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున కాంట్రాక్టు వర్కులు జరుగుతున్నాయని, అయితే  కాంట్రాక్టు పనుల్లో నాణ్యతకు పెద్ద పీఠవేసే విధంగా కాంట్రాక్టర్లలో పోటీ తత్వాన్ని పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో వారికి చెల్లించాల్సిన పేమెంట్ల విషయంలో జాప్యాన్ని నివారించేందుకై కమిషనరేట్ కార్యాలయంలో ఒక అక్కౌంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కాంట్రాక్టు పనులన్నింటికి ఈ అక్కౌంట్స్ విభాగం ద్వారానే చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. 


రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ది కోసం పలు కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దాదాపు రూ.225 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, రూ.150 కోట్లతో శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయం తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాల అభివృద్ది పనులను ఇప్పటికే చేపట్టినట్లు చెప్పారు. సింహాచలం, ద్వారకా తిరుమల దేవాలయాల అభివృద్ది పనులను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. 


ఈ టెండర్ల ఖరారుతో పాటు అభివృద్ది పనులు పారధర్శకంగా జరిగేలా, రూ.5 కోట్లకు పైబడిన దేవాలయాల అభివృద్ది పనుల టెండర్ల పర్యవేక్షణకుగాను దేవాదాయ శాఖ కమిషనర్ అద్యక్షతన రాష్ట్ర స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పలు దేవాలయాల్లో ప్రసాదాలు తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థాల రేట్లలో వ్యత్యాసాన్ని గమనించామని చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని నియంత్రించేందుకు ప్రధాన పదార్థాల రేట్లను నిర్ణయించేందుకు ఒక రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఎన్.ఏ.బి.ఎల్. ఆమోదం పొందిన ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మంత్రి కొట్టు వివరించారు. 


దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.300 కోట్లతో 3000 నూతన దేవాలయాల నిర్మాణ పనులు, దాదాపు రూ.500 కోట్లతో దేవాలయాల పునరుద్దరణ పనులు చేస్తున్నారు. ఈ పనుల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ సిబ్బంది లేకపోవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అవసరం మేరకు సహాయక ఇంజనీర్లను, సూపర్వైజర్లను, టెక్నికల్ అసిస్టెంట్లను, డ్రాప్టుమ్యాన్ లను, స్తపతులను, డిప్యూటీ స్తపతులను ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ ద్వారా అవుట్ సోర్సింగ్ పై భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 
 
దేవాలయ భూముల గుర్తింపులో పురోగతి... 
ప్రతి జిల్లాలోనూ దేవాలయం వారీగా ఉన్న భూముల గుర్తింపు కార్యకంమం మంచి పురోగతిలో ఉంద్ననారు. ఇప్పటివరకూ  దాదాపు 4,07,486 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించగా, ఇందులో దాదాపు 2,80,712 ఎకరాల వివరాలను వెబ్ సైట్లో నమోదు చేశామన్నారు. అదే విధంగా దాదాపు 61 వేల ఎకరాల వాణిజ్య, అటవీ, నదీపరీవాహక  ప్రాంతాల భూమిని కూడా గుర్తించడం జరిగిందని, వీటి వివరాలను 43 రిజిష్టరులో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని పలు దేవాదాయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దేవాదాయ భూముల పరిరక్షణ చట్టాన్ని సవరించడంతో ఆయా భూములను కూడా తిరిగి స్వాదీనం చేసుకుంటామని మంత్రి కొట్టు చెప్పుకొచ్చారు.  


హిందూ  దర్మం అనేది ఒక మతం కాదని మానవుడి జీవన శైలిని, నడతను తెలియజేసే ఒక మహాన్నత విధానమన్నారు. ఈ మహోన్నత విదానాన్ని ప్రజలందరికీ  తెలియజేసేందుకే గత కొద్ది మాసాల నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రధాన దేవాలయాల్లో మాసోత్సవాలతోపాటు ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లోని 6(ఎ) దేవాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వచ్చే వారంలో గోదావరి జిల్లాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.