Kakani Govardhan On Chandrababu : రెండు సార్లు గెలిచిన నన్ను.. రెండు చోట్ల ఓడిన పవన్‌ గురించి అడగొద్దు.. అన్నిస్థానాల్లో పోటీ చేస్తారా అని సీఎం జగన్ చంద్రబాబును సవాల్ చేశారు కానీ.. పవన్ ను కాదని.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.   వైఎస్సార్సీపీ 175 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతుందని… చంద్రబాబుకు ధైర్యముంటే సీఎం జగన్ విసిరిన సవాల్ కు  స్పందించాలని మంత్రి కాకాణి డిమాండ్ చేశారు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగే దమ్ముందో చెప్పాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు ఏమైనా ఉంటే చెప్పాలని కోరారు. అమ్మఒడి, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం వంటి ఎన్ని అద్భుతమైన పథకాలు  తీసుకొచ్చామని చెప్పారు.  పెయిడ్ ఆర్టిస్టులతో ఆయన కుమారుడు లోకేశ్ తో పాదయాత్ర చేయిస్తున్నారని విమర్శించారు. 


రైతుల సంక్షేమం, భద్రత కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి బటన్ నొక్కి రైతులకు ఆర్థిక సాయాన్ని విడుదల చేశారన్నారు. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ రూ.13,500 లబ్ది చేకూరుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నిధులను అందిస్తుందన్నారు.  2019 నుంచి ఇప్పటి వరకు రూ.27 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని రైతు భరోసా కింద అందించామన్నారు. మాండౌస్ తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీతో కలిపి రూ.1912 కోట్లను ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించి సీఎం జగన్ ఇంత మంచి చేసినా విషం చిమ్ముతున్నారని ఫైరయ్యారు.  ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని మండిపడ్డారు. 


చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడని.. మరి ఆ హామీ నెరవేర్చారా లేదా అనేది ఎల్లోమీడియా  ప్రచురించాలని సవాల్ విసిరారు.  2019 ఎన్నికలకు ముందు మేం నాలుగు విడతల్లో రూ.12 వేల రైతులకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించామని.. అధికారంలో వచ్చాక నాలుగు కాదు, ఐదు విడతలుగా రూ.13,500 రైతులకు ఆర్తిక సాయం చేశామని..  మొత్తం ఐదు విడతల్లో దాదాపు రూ.60 వేల రైతులకు లబ్ది చేకూర్చామని చెప్పారు. 


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా అని విమర్శించారు.  ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరవు మండలాలు ప్రకటించారని.. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కరవు మండలం అయినా ప్రకటించారా అని ప్రశ్నించారు . రైతులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి పట్టదని.. అందుకే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సాగు నీటి వసతులు కల్పించామని.. దీంతో పంట దిగుబడులు పెరిగాయన్నారు దీన్ని కూడా విమర్శించడం ఏంటని మంత్రి తప్పు బట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు 80శాతం పూర్తి చేశామని టీడీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు… మరి మిగతా 20శాతం పూర్తి చేయడానికి మీకు ఏం అయిందని ప్రశ్నించారు.