AP leaders in BJP President Nitin Nabin nomination process: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం ఎన్నిక కావడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అగ్ర నాయకత్వం కీలక పాత్ర పోషించింది. సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబీన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన సందర్భంలో, తెలుగు రాష్ట్రాల నేతలకు హైకమాండ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం మద్దతు తెలపడమే కాకుండా, అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ప్రతిపాదించే  ప్రధాన వ్యక్తుల జాబితాలో ఏపీ బీజేపీ నేతలు చోటు సంపాదించడం విశేషం.

Continues below advertisement

ఈ ప్రతిష్టాత్మక నామినేషన్ కార్యక్రమంలో ఏపీ నుంచి పలువురు సీనియర్ నేతలు పాలుపంచుకున్నారు. కేంద్రమంత్రి  భూపతిరాజు శ్రీనివాస వర్మ , రాష్ట్ర మంత్రి సత్యకుమార్, దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ ప్రక్రియలో చురుగ్గా వ్యవహరించారు.                     

జాతీయ స్థాయిలో పార్టీ పగ్గాలను ఒక యువ నేతకు అప్పగిస్తున్న తరుణంలో, ఆ ప్రక్రియలో ఏపీ నేతలను భాగస్వాములను చేయడం ద్వారా రాష్ట్ర ప్రాధాన్యతను అధిష్టానం మరోసారి చాటిచెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు నేతలు ముందు వరుసలో నిలిచి నితిన్ నబీన్‌కు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర పార్టీ కార్యవర్గంలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురికి కీలక పదవులు దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఏపీ నేతల భాగస్వామ్యం ఉండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు కూడా ఏపీ నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతున్నాయి. జేపీ నడ్డా వారసుడిగా బాధ్యతలు చేపడుతున్న నితిన్ నబీన్ నాయకత్వంలో ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ నేతలు సిద్ధమవుతున్నారు.