AP Advanced Supplementary Exams |అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు కేవలం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని, ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా కల్పిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని బోర్డుల విధానాలను పరిశీలించిన అనంతరం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ సప్లిమెంటరీ నుంచే అమలుమే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కానుంది. గత నెలలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి ఈ Single Attempt అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థి రాసిన పరీక్షల్లో ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే, వాటినే తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీలోపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణ పరీక్ష ఫీజు రూ. 600తో పాటు, ఇంప్రూవ్మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే వరకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసే వీలు కల్పించారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు తమ పర్సంటేజీని పెంచుకోవడానికి మంచి అవకాశం లభించినట్లయిందని చర్చించుకుంటున్నారు.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ లో 77 శాతం విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్ లో 81 శాతం పాసయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రివెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇటీవల విడుదల చేశారని తెలిసిందే.
