AP HighCourt :     ఆంధ్రప్రదేశ్  సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు , ఐపిఎస్ ద్వారకా తిరుమలరావు లకు నెల రోజులు జైలు శిక్ష,1000/- జరిమానా  విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.  16వ  తేదీ లోగా రిజిస్ట్రార్ జ్యూడిషియల్ ముందు  లొంగిపోవాలని  వారిద్దరినీ ఆదేశించింది.  వీరిని శిక్ష అనుభవించేందుకు వెంటనే జైలు కు పంపాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకూ శిక్ష  విధించింది.  తమ సర్వీసును క్రమబద్దీకరించే విషయంలో  నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారి సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. 2022 ఆగస్టులోనే హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెల్లించలేదు. సర్వీసును క్రమబద్దీకరించలేదు. దీంతో ఆ ఉద్యోగులుధిక్కరణ  పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారుల తీరుపై మంమడిపడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అయితే తాము ఈ తీర్పును అప్పీల్ చేశామని.. ఆర్టీసీ లాయర్లు హైకోర్టులో వాదించారు. కానీ స్టే రాలేదు కదా.. అలాంటప్పుడు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు మండిపడింది. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 


ఏపీకి చెందిన పలువురు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీలో ఫీల్డ్ మన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తమ ఆదేశాలను అమలు చేయకపోవడం హైకోర్టును ఆగ్రహానికి గురిచేసింది. గతంలోనూ చాలా సార్లు హైకోర్టు ఏపీ సివిల్ సర్వీస్ అధికారులకు జైలు శిక్ష విధించింది.  తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది. ఓ సారి ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కూడా చాలా కేసుల్లో ఇలాగే జైలు శిక్ష విధించారు. తర్వాత అప్పీల్‌కు వెళ్లి వీరంతా జైలుకు వెళ్లకుండా బయట పడ్డారు. ఇప్పుడు కూడా ద్వారకా తిరుమల రావు, కృష్ణబాబు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఊరట లభించకపోతే.. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదే జరిగిదే వారి కెరీర్‌లో ఓ మచ్చగా ఉండిపోతుంది. 


హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వందల కోర్టు ధిక్కరణ కేసులు పడుతున్నాయి. పెద్ద ఎత్తున సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎస్, డీజీపీలు కూడా చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇలాంటి కోర్టు ధిక్కారణ కేసులు పెరుగుతున్నా.. ఉత్తర్వులు అమలు చేయడంలో మాత్రం అధికారులు చురుకుగా లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి.