సొంత ఊరి నుంచే.. ఉద్యోగులు పని చేసుకునేలా.. ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఉద్యోగులు తమ సొంత ఊరి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని కంపెనీలకు కల్పిస్తూ దేశంలోనే తొలిసారిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల్లో 25 డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇటీవలే తెలిపారు.  


ఉద్యోగులు వారి సొంత ఊళ్ల నుంచే పని చేసుకునేలా.. 30 మంది కూర్చునే విధంగా కోవర్కింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 30 డెస్క్‌టాప్‌లు, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, డేటా భద్రత వంటి అన్ని వసతులతో కోవర్కింగ్‌ స్టేషన్లు ఉండనున్నాయి.  


కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ విధానాన్ని మూడు దశల్లో అమలు చేయడానికి ఐటీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్వహణ వ్యయం తగ్గించుకునేలా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి, ఇన్నోవేషన్‌ సొసైటీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, గ్రామ డిజిటల్‌ లైబ్రరీలు, ఏపీఐఐసీ భవనాలను వినియోగించుకోనున్నారు.  


వర్క్‌ స్టేషన్లకు అవసరమైన భవనాలను ఇప్పటికే ఏపీఎస్‌ఎన్డీసీ గుర్తించగా.. 3 దశల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లను నెలకొల్పేందుకు ఐటీశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటికయ్యే వ్యయం, స్పేస్‌, ఒక్కో ఉద్యోగి, వర్క్‌ స్టేషన్‌కి అయ్యే ఖర్చులపై ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది.


కాస్ట్‌ టు కాస్ట్‌ విధానంలో వీటిని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఏపీఎస్‌ఎన్డీసీ నెలకొల్పిన ఎక్సలెన్స్‌ సెంటర్లు, ఈఎస్‌సీ సెంటర్లను కోవర్కింగ్‌ స్టేషన్లుగా వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కాకినాడ, విశాఖలోని ఏపీ ఇన్నోవేషన్‌ సెంటర్లు, విలేజ్‌ డిజిటల్‌ సెంటర్లు, ఇంజినీరింగ్‌ కాలేజీలు., కోవర్కింగ్‌ స్టేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిపారు. 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లు, వర్కింగ్‌ స్టేషన్లుగా జిల్లాలలోని ఏపీఐఐసీ భవనాలు, ఈఎస్‌సీలను మలుచుకునే దిశగా మ్యాపింగ్‌ చేయాలని మంత్రి మేకపాటి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 14న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: NIMS: మీకు కరోనా సోకి తగ్గిందా? జాగ్రత్త.. ఈ కొత్త సమస్య రావొచ్చు, నిమ్స్‌లో ఆరుగురి చేరిక..


Also Read: KTR News: రాంగ్‌ రూట్‌లో కేటీఆర్‌ కారు.. ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. చివరికి ఏమైందంటే..