ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వాట్సాప్‌తో చేతులు కలిపింది. ఏపీ డిజిటల్ కార్పరేషన్ ఈ మేరకు వాట్సాప్‌తో వెరిఫైడ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. దీని ద్వార సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ విధానాలను కూడా ప్రజలకు వివరించనున్నారు. 


ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ వినియోగదారులు రోజురోజుకు పెరుగుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఎలాంటి సమాచారమైన క్షణాల్లో ప్రజలకు చేరిపోతోంది. అందుకే వాట్సాప్ ద్వారా ప్రజలకు మరింత వేగంగా చేరవచ్చని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఈ నిర్ణయం తీసుకుంది. 


ప్రభుత్వం నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ కార్యక్రమాల సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా వాట్సాప్‌ ఇండియాతో ఏపీడీసీ వాట్సాప్ వేదికకు హెల్ప్ చేయనుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు కూడా ఈ ప్రయత్నం ప్రయోజన కరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 


ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తి స్థాయి వాట్సాప్‌ చాట్‌బోట్‌ సేవలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో పూర్తి పారదర్శకంగా అందుతున్న సేవలు వివరాలను ప్రజలు సమగ్రంగా తెలుసుకునే వీలు కలుగుతుందని ఏపీడీసీ అభిప్రాయపడుతుంది. 


ఖ్యమంత్రి జగన్ అభివృద్ధి అజెండాను ఏపీ ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ఫేమస్‌ మెసేజింగ్ అప్లికేషన్‌ వాట్సాప్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీడీసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వాట్సాప్‌ వారధిలా పని చేస్తుందని కామెంట్ చేశారాయన. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్‌ని మెరుగుపరిచే ప్రయత్నంలోన తాము మద్దతు ఇవ్వడం మాకు గౌరవంగా ఉందన్నారు వాట్సాప్‌ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌ శివనాథ్ ఠుక్రాల్. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లో త్వరగా, సులభంగా, సమాచారం చేరవేయడానికి, పరిస్థితులకు అనుగుణంగా సంబంధాలు ఏర్పరుచుకోవడానికి వీలవుతుందన్నారు. ఇ-గవర్నెన్స్ పరిష్కారాలను రూపొందించడానికి భారతదేశం అంతటా ప్రభుత్వాలు, నగర పరిపాలనలతో నిరంతరం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు శివనాథ్ ఠుక్రాల్.