Sachivalayam Employees: గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న నెపంతో దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ నిలిపి వేయడం హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల సర్వీసు పూర్తి అయి, శాఖపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణఉలు అయినప్పటికీ.. వారిని పక్కన పెట్టింది. ముఖ్యంగా కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఎక్కువ శాతం ప్రొబేషన్ నోచుకోలేదు. అయితే వీరి ప్రొబేషన్ నిలుపుదలకు ముఖ్య కారణం.. గతంలో ఈ ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారు విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే అని తెలుస్తోంది.


బిల్లులు సకాలంలో అప్ లోడ్ కానందునే..


ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.21 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 1.05 లక్షల మందికి తాజాగా ప్రొబేషన్ ఖరారు చేశారు. కానీ 90 వేల మందికి మాత్రమే జులై నెలకు సంబంధించి పెరిగిన కొత్త జీతాలు ఉద్యోగుల బ్యాంకులో ఖాతాల్లో జమయ్యాయి. 15 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు మూల వేతనమే అందింది, మరో 5 వేల మంది ఉద్యోగుల జీతాల బిల్లులు సకాలంలో అప్ లోడ్ కానందున కొత్త వేతనాలు రాలేదు. 2 వేల మందికి ప్రొబేషన్ ఖరారు చేయకపోవడంతో పాత వేతనాలే జమ అయ్యాయి. అప్పట్లో నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో ఏపీ ప్రభుత్వం వీరిని పక్కన పెట్టినట్లు సమాచారం. 


ప్రొబేషన్ ప్రాంరంభంలోనే ఆందోళనలు..


మిగిలిన 9 వేల మందిలో శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారు, ఉత్తీర్ణులు అయినా ఇతర కారణాలతో ప్రొబేషర్ ఖరారు చేయని వారు, రెండేళ్ల సర్వీసు పూర్తి అవ్వని వారు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన తొలి నాళ్లలోనే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ మొదలయ్యాక.. అప్పట్లో ప్రబుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో ఆందోళనకు దిగిన ఉద్యోగుల పేర్లు జిల్లా కలెక్టర్లకు వెళ్లాయి. రెండేళ్ల సర్వీసు పూర్తయి, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రొబేషన్ ఖరారుకు అర్హత కల్గిన వారిని కలెక్టర్లు, అధికారులు పక్కన పెట్టారు. 


నాడు ప్రశ్నించారని నేడు ఆపేశారు..!


2019 అక్టోబర్ లో ఉద్యోగాలు చేయడం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు... 2021 అక్టోబర్ నెలతో రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి అయింది. అప్పటికి 50 వేల మంది ఉద్యోగులు శాఖాపరమైన పరీక్షల్లో పాస్ అయ్యారు. వీరి ప్రొబేషన్ ఖరారు చేస్తే నవంబర్ నుంచి కొత్త జీతాలను అందుకునే వారు. కానీ అలా జరగలేదు. ఇదే విషయయమై పలువురు ఉద్యోగులు ఈ ఏడాది ప్రారంభంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అదే దాదాపు 2 వేల మంది సచివాలయ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. నేడు ప్రొబేషన్ పొందకుండా చేస్తోంది. వారితో పాటు వారి కుటుంబాలలో ఆందోళనను పెంచుతోంది.


Also Read: YS Jagan : కుప్పం అభ్యర్థి భరతే - ఈ సారి వైఎస్ఆర్‌సీపీ గెలిచి తీరాలని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం !