Old Pension Scheme: పాత పింఛను విధానాన్ని అమలు చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆలోచన పడింది. సర్కారు ఉద్యోగులకు పాత పింఛను విధానంలోనే అన్ని సౌకర్యాలు కల్పించాలని యోచిస్తోంది. అయితే.. 2004వ సంవత్సరం కంటే ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛను అమలు చేసే అంశంపై అధ్యయనం చేయాలని ఏపీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. 2004 సెప్టెంబరు 1వ తేదీ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పింఛను వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబరు 1వ తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ విభాగం కోరింది. 


అన్ని వివరాలతో సమావేశానికి రండి..


2004 కంటే ముందుగా చేరిన ఉద్యోగులకు పాత పింఛను అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఈ నెల 14న సచివాలయంలో సంబంధిత సమాచారంతో సమావేశానికి రావాల్సిందిగా సంబంధిత హెచ్ఓడీ కార్యాలయాలకు, ఆయా శాఖల కార్యదర్శులకు లేఖలు రాసింది ఏపీ సర్కారు. వివిధ విభాగాల కార్యాలయాల్లోని అధికారులు ఈ భేటీకి అన్ని వివరాలు తీసుకురావాల్సిందిగా ఆర్థిక శాఖ విభాగం ఆదేశించింది. ఇప్పటికే 2004 సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6 వేల 510 గా ఉన్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలియజేసింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో 2004 కంటే ముందుగా ఉద్యోగాల్లో చేరిన వారు ఎంత మంది ఉన్నారు అనే దానితో పాటు మిగతా వివరాలు కూడా సేకరించనున్నారు. 


ఈమధ్యే ఉద్యోగుల భేటీ అయిన సర్కారు..


పింఛను విధానాలపై ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది. సీపీఎస్ కంటే మెరుగ్గా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ - జీపీఎస్ ను తీసుకువచ్చామని, కొత్త పింఛను పథకంలో చాలా మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.


సర్కారు ప్రతిపాదనను తిరస్కరించిన ఉద్యోగులు..


మంత్రులు చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో తిరస్కరించాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో సీపీఎస్ పై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే చర్చలు ముగిశాయి. 


జీపీఎస్‌లో ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారంటీ పింఛను కనీసం రూ. 10 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగి, వారి జీవిత భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకోలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగి చనిపోయినా జీవిత భాగస్వామికి పింఛను సదుపాయాలు కల్పిస్తామనీ చెప్పినా వినలేదని మంత్రి తెలిపారు. జీపీఎస్ రద్దుకు ససేమిరా ఒప్పుకునేది లేదని అన్న ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని బొత్స వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని, తీవ్రమైన కేసులు పెట్టిన అంశాన్ని గురువారం సీఎం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.