AP Flash Floods Synoptic features of weather inference of Andhra Pradesh | అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో  వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆకస్మిక వరదలు (Flash Floods in AP) వచ్చే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య ఉన్న పుదుచ్చేరి, నెల్లూరు మధ్య అక్టోబర్ 17న ఉదయం చెన్నైకి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.


ఏపీలో ఆ జిల్లాలకు ఆకస్మిక వరదలకు అవకాశం


బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పెన్నా నది పరీవాహక ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు సైతం పొడిగించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు.






ఇటీవల ఆకస్మిక వరదలతో భారీగా నష్టం
కొన్ని రోజుల కిందట ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు వచ్చాయి. భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చి ఇటు ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలో విజయవాడలో తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు ఏపీ, తెలంగాన సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో తమకు తోచినంత విరాళాలు ప్రకటించి ఆదుకున్నారు.


ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి అధికారులను, ప్రజలను వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లాతో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో సైతం లోతట్టు ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు రెండు రోజుల కిందటే హెచ్చరించారు.


Also Read: Rail Bus Service In Konaseema: కోనసీమ అందాలు చూపించే కాకినాడ- కోటిపల్లి "రైలు బస్సు"- రీ స్టార్ట్ చేయాలని కోరుతున్న ప్రజలు