AP Electricity Employees withdraw strike notice: 
అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్‌ సంఘాల జేఏసీ. పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) లో భాగంగా  డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఏపీఎస్‌ పీఈజేఏసీ (APS PEJAC) ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. 


ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడి మంచి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు సూచించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, ఈపీడీసీఎల్, స్పీడీసీఎల్‌ అధికారులు, జేఏసీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఉద్యోగుల పీఆర్సీపై ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇవ్వడం సహా 8 శాతం ఫిట్‌మెంట్‌కు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అనామలీస్‌ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్‌ చేయడానికి ఏపీజెన్‌కో ఎండీ నేతత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది.


12 డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. సమస్యల పరిష్కారానికి బుధవారం రాత్రి వరకు గడువు ఇచ్చి, పరిష్కారం చూపకపోతే నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. దాంతో ఏపీ సచివాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సబ్ కమిటీ బుధవారం సాయంత్రం చర్చలు జరిపింది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉద్యోగుల జేఏసీతో వేతన సవరణ, వన్‌మ్యాన్ కమిటీ నివేదికపై చర్చలు జరిపారు. 


డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా నిరసనలు, ఆందోళనలు 
దశలవారీగా రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు గత నెలలో పిలుపునిచ్చారు. జులై 27న భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగులు నిరసనను ప్రారంభించారు. తొలి దశలో జులై 27 తేదీ నుంచి మొదలుపెట్టననున్న నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఆగస్టు 9 వరకు కొనసాగించారు. ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తే నిరవధిక సమ్మెను విరమించుకుంటామన్నారు. ఆ ఆందోళనలు, నిరసనలలో రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్‌, జోనల్‌, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్‌ ఆఫీసులలో సేవలు అందిస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.