Pawan Kalyan : ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ పై గుంటూరులో  కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు క్యాఫ్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేశారు.  విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.   

  
 
అసలు సంగతి ఇదే!
 2023 జులై 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని వాలంటీర్లు అప్పట్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఏపీలో 29,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్‌సీఆర్‌బీ డేటాను ప్రస్తావిస్తూ.. మహిళల అక్రమ రవాణాలో సంఘ వ్యతిరేక శక్తులకు వాలంటీర్లు సహకరిస్తున్నారని కేంద్ర ఏజెన్సీల నుంచి తనకు సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీవో జారీ చేసింది. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు స్టే విధించింది. విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.


 
నా వైఖరి మారదు : పవన్
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అప్పటి వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పవన్ పై మంత్రులు విరుచుకుపడగా.. వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పే వరకు శాంతించమని నిరసనకు దిగారు.  పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్వయంగా హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ పై కేసులు పెట్టేందుకు వలంటీర్లకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ జీఓ జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు కేసులు పెట్టారు. అయితే వాలంటీర్ల విషయంలో మాత్రం తన వైఖరి మారదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాలంటీర్లను ఉపయోగించి వైసీపీ ప్రభుత్వం కీలక సమాచారాన్ని సేకరించిందని పవన్ అప్పట్లో విమర్శించారు.


 ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు 
 మరోవైపు పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ లో అటవీ ఉద్యోగులపై స్మగ్లర్ల దాడి ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ దాడిని ఖండిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. వన్యప్రాణుల అక్రమ రవాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇకపై ఎవరైనా వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తే, అటవీ ఉద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.