AP CM Jagan: జగనన్న విదేశీ విద్యాదీవెన రెండో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 357 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.45.53 కోట్లను బటన్‌ నొక్కి మరీ జమ చేశారు. గడచిన ఆరు నెలల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద మొత్తంగా రూ. 65.48 కోట్లు విడుదల అయ్యాయి. దేవుడి దయతో నేడు రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. మంచి కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి, డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువుల జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఆ పథకం రాష్ట్ర విద్యార్థులకు వరంలా మారిందని అన్నారు. మొత్తంగా 357 మంది పిల్లలకు ఇవాళ రూ. 45.53కోట్లు జమ చేస్తున్నామన్నారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. 






ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా వారికి పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. క్యూస్‌, టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లోని 21 కోర్సుల్లో ఉన్న టాప్‌ 350 కాలేజీల్లో సీటు వస్తే డబ్బులు అందజేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్లు వరకూ మిగిలిన వారికి కోటి రూపాయల వరకూ చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. విమాన ఛార్జీలు, వీసా ఛార్జీలు కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. టాప్ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజులు చెల్లించలేని సామాన్య, మధ్యతరగతి పిల్లలకు సర్కారే ఫీజు చెల్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కాలేజీలలో చదివి రాష్ట్ర విద్యార్థులు బయటకు వస్తే.. ప్రపంచంలోని అనేక టాప్ కంపెనీలను శాసించే స్థాయికి చేరుతారని వివరించారు. విద్యార్థులు అంతా పెద్ద స్థాయిలోకి వెళ్లే అవకాశం వస్తుందన్నారు. ఇలాంటి కాలేజీల్లో సీట్లు వచ్చే మన పిల్లలకు మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. 










గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు రూ.15 లక్షలు మాత్రమే చెల్లించే వారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఏకంగా 1.25కోట్లు ఇస్తున్నట్లు వివరించారు. గతంలో సిఫార్సులు ఉంటేనే ఇచ్చేవారని.. అదికూడా అరకొరకే అని విమర్శించారు. ఇవాళ ఆ స్కీంలో పూర్తిగా మార్పులు తీసుకు వచ్చామని.. శాచ్యురేషన్‌ పద్ధతిలో అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. టాప్‌ 320 కాలేజీలకు వర్తింపు చేస్తున్నామన్నారు. విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పు అని చెప్పారు. ఇలా విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమేనన్నారు. ఈ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు పెద్ద పెద్ద స్థాయిల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నాలుగు వాయిదాల్లో ఈ స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నామని.. ఇమ్మిగ్రేషన్‌ అనుమతి రాగానే ఒక వాయిదా, మొదటి సెమిస్టర్‌ పూర్తికాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్‌ రాగానే మూడో వాయిదా, 4వ సెమిస్టర్‌ పూర్తయ్యాక నాలుగో వాయిదా ఇస్తున్నామని వివరించారు.