CM Chandrababu Meet With Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటన సాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) భేటీ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని.. తగిన చేయూత ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణాలకు నిధులు, అప్పులకు అనుమతుల సడలింపు వంటి అంశాలపై చర్చించారు. అలాగే, వివిధ పథకాలకు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సుమారు అరగంట పాటు వీరి సమావేశం సాగింది. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలు ఉన్నారు. తొలుత నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను సీఎం కలిశారు. 


మరికొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ


మరికొందరు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం మంత్రి రామ్‌దాస్ అథవాలే, వేదంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్, ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఛైర్మన్ సంతోష్ యావద్‌లతో మధ్యాహ్నం భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యటన గురించి వివరిస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరుతారు.


ప్రధానితో భేటీ


ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారు. విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చర్చించారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఈ నెల 6న (శనివారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారంపై సైతం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన సీఎం వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌, మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియాను కలిసి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక మద్దతు కోసం వినతులందించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజనం చట్టం అమలుపై చర్చించారు.


అలాగే, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ వ్యయం రూ.385 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.27.54 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఏపీకి ఐపీఎస్ అధికారుల సంఖ్య 117కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య 79గా ఉంది.


Also Read: Nara Lokesh: పిన్నెల్లికి జగన్ సపోర్ట్‌పై నారా లోకేశ్ కౌంటర్