AP Chandrababu serious over threatening of winners of Liquor Shops | అమరావతి: ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. ప్రభుత్వానికి మద్యం షాపుల కోసం దరఖాస్తులతో రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది.  రాష్ట్రంలోని మొత్తం 3,396 షాపులకుగానూ 89,882 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్లఆధ్వర్యంలో అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించి మద్యం షాపుల విజేతల్ని ప్రకటించారు. ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు వస్తున్నాయి. కొన్నిచోట్ల మద్యం షాపులు దక్కించుకున్న వ్యక్తులు కిడ్నాప్ అయ్యారని, వారి జాడ కనిపించడం లేదని సైతం వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరించి, రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తే.. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బెదిరింపులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరిండాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 


సమాచారం తెప్పించుకున్న సీఎం చంద్రబాబు


రాష్ట్ర వ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడ్డారనే విషయంపై కలెక్టర్లు, ఉన్నతాధికారులను అడిగి సీఎం చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, ఆబ్కారీ శాఖ, పార్టీ వర్గాలు, ఇతర మార్గాల ద్వారా సీఎం చంద్రబాబు లిక్కర్ షాపుల కేటాయింపు అనంతరం జరిగిన పరిణామాలపై సమాచారం తెప్పించుకుంటున్నారు. మద్యం షాపుల్లో వాటాల కోసం ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే పలువురు నేతలకు అధిష్టానం హెచ్చరించింది. మద్యం షాపులు పొందినవారు కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 


తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ వాసులకు ఏపీ లిక్కర్ షాపులు


ఏపీలో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అందుకోసం వచ్చే రెండేళ్లకు గానూ మద్యం షాపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. భారీ ఎత్తున దరఖాస్తులు రాగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాల నుంచి పలువురు టెండర్లు వేసి ఏపీలో లిక్కర్ షాపులను దక్కించుకున్నారు. లక్కీ డ్రాలో గెలిచిన వారి నుంచి లైసెన్స్ డబ్బులు తీసుకుని వారికి అధికారులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చారు. మరికొందరు మంగళవారం సైతం లైసెన్స్ ఫీజు కోసం నగదు చెల్లించి షాపులను కన్ఫామ్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 15న సాయంత్రం డిపోలో స్టాక్ తీసుకుని ఈ బుధవారం నుంచే కొత్త లిక్కర్ పాలసీతో పాటు లైసెన్స్ పొందిన వ్యాపారులు దుకాణాలు తెరవనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ పరం చేసి, రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం చేకూర్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


లిక్కర్ షాపుల డ్రాలో మహిళు సైతం ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మద్యం దుకాణాలు అధికంగా మహిళలే చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 7 మద్యం షాపులను కైవసం చేసుకున్నారు.  50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌ సభ్యులకు దాదాపు 5 నుంచి 10 లిక్కర్ షాపులు దక్కాయి. కొందరు సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 షాపులు వేసినా అదృష్టం కలిసిరాక, ఒక్క షాపు కూడా దక్కలేదు. 


Also Read: Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం