సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రతిపాదన, ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపింది. కర్నూలులో నేషనల్ లా వర్శిటీకి మరో 100 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


జర్నలిస్టులకు గుడ్ న్యూస్


జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. 


ఇవీ నిర్ణయాలు


అలాగే, పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ పై రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం పడనుందని, అయితే, 50 వేల మంది కార్మికులు దీనిపై ఆధార పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. అలాగే, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్య శ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ - 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపైనా కేబినెట్ లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్ కు పురపాలక శాఖ ప్రతిపాదనలు పంపింది.


ఈ నిర్ణయాలకూ ఆమోదం



  • నవంబరులో సంక్షేమ క్యాలెండర్ అమలు, రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం

  • పౌర సరఫరాల కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు అనుమతి. ధాన్యం సేకరణ కోసం రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం

  • అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన. 467 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఆమోదం

  • తూ.గో, సత్యసాయి జిల్లాల్లో రవాణా శాఖ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం

  • ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా నిర్ణయం, ప్రభుత్వ హైస్కూళ్లలో సాంకేతిక నైపుణ్యం కోసం ఇంజినీరింగ్ కళాశాలలతో మ్యాపింగ్.

  • విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సంస్థకు చిత్తూరు జిల్లా భూకేటాయింపు.

  • గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఎన్టీపీసీకి అనుమతిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


21 నుంచి కులగణన


రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి కులగణన ప్రారంభం అవుతుందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన కృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కులగణన వల్ల వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితి తెలుసుకోవచ్చని, దీని వల్ల ఈ వర్గాల అభ్యున్నతికి ఏం చేయాలో తెలుస్తుందని అన్నారు. 92 ఏళ్ల తర్వాత కులాల వారీగా లెక్కలు తీస్తున్నట్లు పేర్కొన్నారు.


Also Read: రుషికొండలో నిర్మాణాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాజకీయ కారణాలతో వేసినట్లుందని ఆగ్రహం