BJP - Janasena   :  ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై బీజేపీ పెద్దగా కంగారు పడటం లేదు. తమపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి.. వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించి చంద్రబాబుతో సమావేశం అయినప్పటికీ బీజేపీ నేతలు ఇంకా పవన్ కల్యాణ్‌ తమతోనే ఉన్నారని నమ్ముతున్నారు. చంద్రబాబునాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ కేవలం సంఘిభావం కోసమే జరిగిందని.. అలాంటి సమావేశాన్ని చంద్రబాబు కంటే ముందే సోము వీర్రాజు నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజుకు ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించే కొంత మంది బీజేపీ పెద్దలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పరిణామాలపై వారు విశ్లేషించారు. 


పవన్  కల్యాణ్ - చంద్రబాబు భేటీపై ఆరా తీసిన బీజేపీ హైకమాండ్ 


పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ .. తాము బీజేపీతో కటీఫ్ చెబుతున్నానని ఎప్పుడూ ప్రకటించలేదని.. నిన్నటి సమావేశంలో.. రోడ్ మ్యాప్‌ ఆలస్యంపై అసంతృప్తి, బలంగా కలిసి ముందుకు వెళ్లలేకపోయామన్న ఆవేదన  మాత్రమే వ్యక్తం చేశారన్నారు. అందుకే పవన్ కల్యాణ్ విషయంలో ఎవరూ తొందరపడి వ్యతిరేక వ్యాఖ్యలు  చేయవద్దని ఆయన పొత్తులో ఉన్నట్లుగానే మాట్లాడాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు సమాచారం పంపారు. ఈ మేరకు బీజేపీ నేతలంతా.. తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. 


చంద్రబాబు - పవన్ భేటీ సాధారణమేనని ఢిల్లీ పెద్దల భావన


గత ఎన్నికల్లో పరాజయం తర్వాత జనసేన పార్టీ అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తాయి. కానీ పవన్ కల్యాణ్ ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత వారి పోరాటం కలసి కట్టుగా సాగలేదు. బీజేపీలో కొంత మంది నేతలు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదును జనసేన పార్టీ నాయకులు హైకమాండ్‌కు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కారణం ఏదైనా కానీ జనసేన - బీజేపీ కలిసి కట్టుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. తిరుపతి ఉపఎన్నికల్లో తప్ప.. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో జనసేన పార్టీ బేజీపికి మద్దతివ్వలేదు. 


జనసేనతో పొత్తు ఉంటుందన్న బీజేపీ నేతలు 


ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ బిజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల కోసం వైఎస్ార్సీపీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉండటం.. రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తులు కూడా పట్టించుకోలేని ఫీల్ కావడంతో ఆయన దూరం జరుగుతూ వస్తున్నారు. రెండు రోజుల కిందట.. ప్రతీ దానికి తాము ఢిల్లీకి వెళ్లలేమని.. రాష్ట్రంలోనే తేల్చుకుంటామన్నారు. నిన్న బీజేపీ అనుకున్నట్లుగా స్పందించడం లేదని.. వ్యూహం మార్చుకుంటామని అన్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాలను సానుకూలంగానే డీల్ చేస్తోంది. . దీంతో ఇప్పటికిప్పుడు బీజేపీ వైపు నుంచి ఎలాంటి  దూకుడైన ప్రకటనలు ఉండవని భావిస్తున్నారు.