తెలుగు దేశంతో పొత్తులపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్  అధ్యక్షుడు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తామూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనేక సార్లు చెప్పామని ఆయన అన్నారు. ఎన్నికలకు పొత్తుల వ్యవహరంలో పార్టీ అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ నేతలను కలిశారని వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి,  అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అవినీతి పై రాజకీయంగా విమర్శలు చేసిన విషయాలను కూడా సొము వీర్రాజు, గుర్తు చేస్తున్నారు.


అంతేకాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం పై పోరాటాలు చేస్తుందని, అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత  ఏంటనేది మనం ఆలోచించుకుంటున్నామని సొము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానని చెప్పారు. 


నా మాటలను అలా చూడకండి..


పొత్తుల వ్యవహరంపై మాట్లాడిన వీర్రాజు  తన మాటలను విమర్శలు గానో, వ్యతిరేకంగానో చూడొద్దని కూడా వ్యాఖ్యానించారు. దీని వలన ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలుగుతుందని చెప్పారు. రాజకీయాల్లో ఎమైనా జరిగే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడటం వలనే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా తయారయ్యిందనే అభిప్రాయం సొము వీర్రాజు వెలిబుచ్చారు.


పవన్, ముగ్రగడ ఎపిసోడ్ లో..


జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముద్రగడ ఎపిసోడ్ పై కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు,  ప్రజల్లో మమేకం అయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్,  ముద్రగడ పద్మనాభవం మధ్య గొడవ కులపరమైన గొడవగా తాము భావించడం లేదని ఆయన చెప్పారు.


రాష్ట్రంలో గాలి మారుతోంది.. కమలం గుభాళిస్తోంది..  


ఆంధ్రప్రదేశ్ లో గాలి మారుతోందని, కమలం గుభాళిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు అన్నారు. 
మోదీ తొమ్మిదేళ్ల పాలన పై బహిరంగ సభలు జరుగుతున్నాయని చెప్పారు. నిజాలను గుప్పెట్లో పెట్టి ఎంతో కాలం ఆపలేరంటూ ఆయన జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం వేస్తోన్న స్టిక్కర్లు ఎంతో కాలం నిలవవంటూ ద్వజమెత్తారు. ఏపీలోని గత, ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. ఏపీలో కూడాా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు శిఖండి పాత్ర పోషిస్తున్నాయని, నాడు-నేడు పేరుతో జరిగే పనులు,  జగనన్న కిట్లల్లో భాగంగా ఇచ్చే యూనిఫారాలన్నీ కేంద్ర నిధులు అని చెప్పారు.