న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పీఎం సేతు (PM SETU Scheme) పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా ఐటీఐ (ITI) లను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి ఈ సరికొత్త ప్రతిష్టాత్మక పథకం అమలు చేసే తొలి అవకాశాన్ని కల్పించింది.
ఈ పథకం కింద విశాఖపట్నం ఐటీఐ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ ఐటీఐ క్లస్టర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆర్సెల్లార్ మిత్తల్ (Arcelor Mittal) భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఆధునికీకరణ ప్రక్రియకు ప్రముఖ విద్యా సంస్థ నామ్ టెక్ (NAMTECH) అకడమిక్ భాగస్వామిగా వ్యవహరించనుంది. దీని ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభించనున్నాయి.
Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్
కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలే లక్ష్యందేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 60 వేల కోట్ల భారీ బడ్జెట్తో ఈ పీఎం సేతు (PM SETU) పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఐటీఐ విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, కోర్సు పూర్తికాగానే తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం దీనిని డిజైన్ చేశారు.
ఈ పథకంలో భాగంగా హబ్ అండ్ స్పోక్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సరికొత్త మోడల్ ద్వారా ఐటీఐ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ (Technical Training) అందిస్తారు. పరిశ్రమలకు నేరుగా ఉపయోగపడే అత్యాధునిక కోర్సులు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ విధానం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ చొరవతో ఏపీలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకాన్ని దేశంలో తొలిసారిగా ఏపీలోనే అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
