AP Assembly Sessions: ఏపీ శాసన సభలో రెండు కీలక బిల్లులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ఈక్రమంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులకు ఆమోదం లభించింది. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు నుంచి ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నారో వారందరినీ రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని మంత్రి బుగ్గన తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాలు సీఎం జగన్ కమిట్మెంట్ కి నిదర్శనం అని పేర్కొన్నారు. చాలాసార్లు ఆలోచించి అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉద్యోగుల విషయంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బుగ్గన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్ స్కీమ్ ను అధ్యయనం చేశామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మనదే మెరుగైన స్కీమ్ అని, ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. 


జీపీఎస్ తో ప్రభుత్వం రూ.2500 కోట్ల అదనపు భారం పడుతోందని.. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేల మాత్రమే ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆశా వర్కర్ల జీతాలను రూ.10 వేలకు పెంచామన్నారు. అలాగే 108 డ్రైవర్లకు జీతాలు పెంచామని తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికి మేలు చేకూర్చామన్నారు. ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.